ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు.. చరిత్ర సృష్టించారంటూ
పశ్చిమ్ బెంగాల్ లో బీజేపీ ఘన విజయం సాధించడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ప్రధాని మోదీకి కంగ్రాట్స్ తెలిపారు. బెంగాల్ లో బీజేపీ విజయం చారిత్రాత్మకం అని.. నిర్ణయాత్మకమైనదిగా అభివర్ణించారు. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 207 అసెంబ్లీ స్థానాల్లో సంచలన విజయం నమోదు చేసింది. దాంతో తొలిసారిగా బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వం కొలువు దీరబోతుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ కేవలం 80 స్థానాలకే పరిమితం అయింది. ప్రస్తుతం బెంగాల్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
ఇక ఇదే విషయంపై శ్వేతసౌధం ప్రతినిధి కుష్ దేశాయ్ మాట్లాడుతూ.. ఇటీవల ట్రంప్- మోదీ మధ్య జరిగిన సంభాషణలో భారత్ కు మోదీ లాంటి నాయకుడు ఉండటం అదృష్టమని కొనియాడారు. తాజా ఎన్నికల విజయంపైనా ప్రధాని మోదీకి ట్రంప్ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారని పేర్కొన్నారు. బెంగాల్ లో బీజేపీ చారిత్రాత్మకమైన విజయం నమోదు చేసింది. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మమతా బెనర్జీ కోటను బీజేపీ బద్దలు కొట్టింది. ఇటీవల నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు పూర్తికాగా.. బీజేపీ పార్టీ బెంగాల్ తో పాటు అసోం, పుదుచ్చేరిలోనూ ఘన విజయం సాధించింది.

బెంగాల్ లో బీజేపీ జర్నీ ఓ సంచలనం. 2016 ఎన్నికల్లో కేవలం 3 చోట్ల మాత్రమే గెలిచిన బీజేపీ 2019 నాటికి 77 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఏకంగా 207 స్థానాల్లో గెలుపొంది చారిత్రక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది కాషాయ పార్టీ. మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం అయిన భవానీపూర్ లోనూ ఓటమి పాలయ్యారు. బీజేపీ నేత సువేందు అధికారి ఆమెపై విజయం సాధించారు. ఇక ఈ ఫలితాలపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. తమ విజయాన్ని దోచుకున్నారని.. తాము ఓడిపోలేదని అన్నారు. తాను బెంగాల్ సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు. తమ పోరాటం కొనసాగుతుందని దీదీ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications