మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ
తెలంగాణ మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఆమె కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై సుస్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే.. సుస్మిత వ్యాఖ్యలపై 3 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. మరోవైపు కొండా సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
"సుస్మిత వ్యాఖ్యలు సీఎం రేవంత్ ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉన్నాయి. పార్టీ లక్ష్మణ రేఖను ఎవరు అతిక్రమించినా చర్యలు తీసుకుంటాం. పూర్తి సమాచారాన్ని తెప్పించుకొని కొండా సుస్మితపై చర్యలు తీసుకుంటా" అని మల్లు రవి తెలిపారు. అటు కొండా సుస్మిత వ్యవహారంపై ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. పీసీసీ ఛీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నుంచి పూర్తి నివేదిక కోరినట్లు సమాచారం. ఇక ఇప్పటికే సుస్మిత వ్యవహరాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి ప్రకటించిన తరుణంలో సుస్మిత వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ఇక కాంగ్రెస్ మాజీ మంత్రి చిన్నారెడ్డికి కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. తాజాగా వనపర్తి సభలో పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై చిన్నారెడ్డిని కమిటీ వివరణ కోరడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేపై అనుచిత ప్రసంగం చేసిన అంశంపైనా మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని టీపీసీసీ స్పష్టం చేసింది.

మరోవైపు ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. ఎరుకల కులానికి చెందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డా సత్యనారాయణను కులం పేరుతో దూషించినందుకు గానూ జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్ కావడం, బుడ్డా ఫిర్యాదు చేయడంతో జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications