NEET Admissions: కేంద్రప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఊరట-తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు..!
ఈ ఏడాది వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ 2026 కౌన్సెలింగ్ (NEET Admissions) విషయంలో తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాలు మారే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించే విషయంలో స్ధానికత ఖరారు విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఊరట దక్కినట్లయింది.
రాష్ట్రం బయటకు బదిలీ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో స్థానిక అభ్యర్థులుగానే పరిగణించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఉద్యోగి అయిన తన తండ్రి హైదరాబాద్ నుండి తిరుపతికి బదిలీ అయిన తర్వాత ఏపీలో చదువుకుని నీట్ లో అర్హత సాధించిన ఒక విద్యార్థిని విషయంలో ఈ తీర్పు ఇచ్చింది. తెలంగాణ వైద్య, దంత వైద్య ప్రవేశ నిబంధనల కింద కల్పించిన మినహాయింపు పరిధి నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను మినహాయించడాన్ని సవాలు చేస్తూ 18 ఏళ్ల కోడిమెల సంహిత అనే విద్యార్ధిని ఈ పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, మరో జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్ విచారణ జరిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం తనకు స్థానిక అభ్యర్థి హోదా కల్పించాలని పిటిషనర్ విద్యార్ధిని కోరారు. అడ్మిషన్లలో కొన్ని వర్గాలకు మినహాయింపులు కల్పించినప్పుడు, తెలంగాణ రాష్ట్రం బయట విధులు నిర్వర్తిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను, వారి పిల్లలను ఆ మినహాయింపు ప్రయోజనం పొందకుండా అడ్డుకోవడానికి ఎలాంటి హేతుబద్దమైన కారణం లేదని కోర్టు తేల్చింది. 2008 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో పుట్టిన పిటిషనర్.. తాను తెలంగాణలో శాశ్వత నివాసిగా పేర్కొంది. 1997లో కేంద్ర కార్మిక శాఖలో ఉద్యోగిగా చేరిన తండ్రి.. ఏపీ, తెలంగాణలో పనిచేశారు. 2016 డిసెంబర్ 15న తిరుపతికి బదిలీ అయ్యారు. అక్కడ 2024 మే 21 వరకు పనిచేశాక 2024 మే 22న తిరిగి హైదరాబాద్కు బదిలీ అయ్యారు. దీంతో తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయన కుమార్తెకు స్దానికత వర్తించదన్న అధికారుల నిర్ణయాన్ని కోర్టు తోసిపుచ్చింది.














Click it and Unblock the Notifications