నిత్య పెళ్ళికొడుకు జగదీష్ అరెస్ట్
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు చేసిన పోలీసుల శ్రమ ఫలించింది. జగదాంబ ధియేటర్ యజమాని వేగి రాంబాబు, అతని కుమారుడు జగదీష్ చెన్నైలో పోలీసులకు చిక్కారు. వారి ఆచూకీ తెలుసుకున్న టూటౌన్, టాస్క్ఫోర్స్ పోలీసులు విమానంలో వెళ్లి, తమ లగేజీతో నడుచుకుంటూ వెళ్తున్న తండ్రీ కొడుకులను అదుపులోకి తీసుకున్నారు. వివిధ కోణాల్లో విచారించిన అనంతరం వారిని అరెస్టుచేశారు.
సెక్షన్ 498 ఏ ప్రకారం వారిని విచారించనున్నారు. సుమారు ఏడు వివాహాలు చేసుకున్న జగదీష్ తమను శారీరకంగా మానసికంగా వేధింపులకు గురిచేసి ఆపై ఏమీ పట్టనట్టు వదిలేశాడని బాధితులు వెంకటరాణి, సంధ్య, కృష్ణవేణి చేసిన ఫిర్యాదును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. దీంతో మూడు రోజుల కిందట పోలీసులు విజయవాడ, ఖమ్మం, నెల్లూరు, చెన్నైలకు బృందాలను పంపించారు. లాడ్జీలు, రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్సు తదితర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్టు తెలుసుకున్న పోలీసులు ఈ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. చెన్నైలోని ఓ వీధిలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తండ్రీ కొడుకులు అనూహ్యంగా పోలీసులకు చిక్కారు. నాలుగు రోజుల నుంచి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులకు రాంబాబు, జగదీష్లు చెన్నైలో ఉన్నట్టు తెలుసుకుని శనివారం ఉదయం అక్కడకు వెళ్లారు. నిందితులు వాడుతున్న సెల్ఫోన్ ఆధారంగా పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
ప్రత్యేక వాహనంలో నగరానికి..: నిందితులను టూ టౌన్ సీఐ, టాస్క్ఫోర్స్ ఎస్ఐ, మరో ఐదుగురు కానిస్టేబుళ్లు ఓ ప్రత్యేక వాహనంలో చెన్నై నుంచి తీసుకువస్తున్నారు. శనివారం రాత్రి సమయానికి విజయవాడ చేరుకున్న పోలీసులు కాసేపు విశ్రాంతి తీసుకుని ఆదివారం ఉదయానికి నగరానికి తీసుకురానున్నట్టు తెలిసింది. నిందితులపై ఆరోపణలు వెల్లువెత్తడం, వారి కుటుంబసభ్యులపై బాధితులు దాడికి దిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. విశాఖ తీసుకువచ్చేవరకూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వహిస్తున్నట్టు తెలిసింది.