వచ్చి కలుస్తాం: సోనియాకు వైయస్ విజయమ్మ లేఖ
వైయస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడం కోసం తన కుమారుడు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రకు అధిష్ఠానం నుంచి చుక్కెదురైన నేపథ్యంలో విజయలక్ష్మి ఈ లేఖ రాయడం విశేషమని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. "నా కుమారుడైన కడప ఎంపీ జగన్ బాధిత కుటుంబాలను కలిసేందుకు కూడా ఆటంకాలు కల్పించడం బాధ కల్గిస్తోంది. అందుకే ఈ లేఖ ద్వారా మా ఆవేదనను మీకు తెలియజేస్తున్నాను. అవకాశం ఇస్తే స్వయంగా కలిసి మొత్తం పరిస్థితిని వివరిస్తాను' అని ఆమె తన లేఖలో అధ్యక్షురాలికి విన్నవించినట్లు తెలిపింది.
బుధవారం ఉదయం విజయమ్మ సోనియాకు లేఖ రాసినట్లు ఆ పత్రిక రాసింది. వైయస్ మరణించి సరిగ్గా తొమ్మిది నెలలు పూర్తి కావడంతో ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ, పార్టీ పరంగా తమ కుటుంబ సభ్యులకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారని తెలిపింది. ప్రధానంగా జగన్ ఓదార్పు యాత్రకు బ్రేక్ వేయ డం గురించి ప్రస్తావించినట్లు రాసింది. ఇది జగన్ను, తమ కుటుంబ సభ్యులను ఎంతగా ఆవేదనకు గురి చేసిందీ వివరించినట్లు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పార్టీలో జరుగుతున్న పరిణామాలను సవివరంగా తెలిపేందుకు ప్రయత్నించినట్లు ఆ పత్రిక వార్తా కథనం తెలియజేస్తోంది.