చంద్రబాబుపై రోశయ్య సూచన: చవాన్ కు సోనియా ఫోన్
చంద్రబాబు బృందం జ్యుడిషియల్ కస్టడీ సోమవారం ముగిసింది. దీంతో మెజిస్ట్రేట్ తిరిగి తెలుగుదేశం నాయకులను విచారించి కస్టడీని ఐదు రోజులు పొడిగించారు. చంద్రబాబును, తెలుగుదేశం నాయకులను ఔరంగాబాద్ జైలుకు తరలించడానికి సన్నాహాలు చేస్తుండగా సోనియా నుంచి చవాన్ కు ఫోన్ వచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రోశయ్య సోమవారం సోనియా గాంధీతో సమావేశమయ్యారు. చంద్రబాబు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బాబ్లీ యాత్ర చేపట్టారని, అందువల్ల కాంగ్రెసుకు నష్టం వాటిల్లవచ్చునని, బాబ్లీకి చంద్రబాబును అనుమతిస్తే మంచిదని రోశయ్య సోనియాతో చెప్పినట్లు సమాచారం. దీంతో సోనియా చవాన్ కు ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. బాబ్లీకి చంద్రబాబును అనుమతించాలని ఆదివారం రోశయ్య చవాన్ కు సూచించారు. అయితే దాన్ని చవాన్ ఖాతరు చేయలేదు.
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై, ఉప ఎన్నికల పరిస్థితిపై రోశయ్య సోనియాకు వివరించినట్లు చెబుతున్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై కూడా సోనియా రోశయ్యతో చర్చించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఈ సమావేశంలో పాల్గొనలేకపోయారు.