జగన్ దీక్ష: ధిక్కరించిన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కాంగ్రెసు నోటీసులు?
పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి దీక్షలో వైయస్ జగన్ పక్కనే కూర్చున్నారు. దాదాపు 21 మంది శాసనసభ్యులు వైయస్ జగన్ దీక్షకు హాజరయ్యారు. మాజీ మంత్రులు, నాయకులు చాలా మందే ఉన్నారు. వీరందరిపై కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకుంటుందా, అంత ధైర్యం చేస్తుందా అనేది అనుమానంగానే ఉంది. శాసనసభ్యులపై చర్యలు తీసుకుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తుందనేది అర్థమవుతోంది. ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా ఆయన వెంట ఉన్నారు. బయటకు కనిపిస్తున్నవారు అంతే మంది. అయితే, జగన్కు మద్దతు తెలుపుతున్నవారు బయటకు కనిపించకుండా ఎంత మంది ఉన్నారనేది అంచనాకు అందడం లేదు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని వైయస్ జగన్ నిర్ణయం తీసుకుంటే వారంతా బలపరిచే అవకాశం లేకపోలేదు. పైగా, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీ కూడా పరోక్షంగా జగన్కు సహకరించే అవకాశాలు లేకపోలేదు. దీనివల్ల జగన్ వెంట వెళ్లిన తమ పార్టీ శాసనసభ్యులపై చర్యలు తీసుకోవడం కాంగ్రెసు అధిష్టానానికి అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది.