వైయస్ జగన్ మీడియాపై విహెచ్ ఫైర్, ప్రెస్ మీట్ లో రగడ
రైతులపై వైయస్ జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు పాపం దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పాపమేనని ఆయన విమర్శించారు. పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకుపోతుంటే ఎవరూ మాట్లాడలేదని, దాని వల్ల దిగువ ప్రాంతాలకు నీరు అందడం లేదని ఆయన అన్నారు. ఏ స్థాయి నుంచి పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకుని పోతారని దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి అడిగితే వైయస్ సమాధానం కూడా చెప్పలేదని ఆయన అన్నారు. అప్పుడున్న ప్రాముఖ్యత వల్ల వైయస్సార్ ఏం చేసినా నడిచిందని ఆయన అన్నారు.
కృష్ణా ట్రిబ్యునల్ ముందు వైయస్సార్ నియమించిన న్యాయవాదులు సరిగా వాదనలు వినిపించలేదని, దానివల్లనే ట్రిబ్యునల్ నుంచి ఆ విధమైన తీర్పు వెలువడిందని, తప్పు వైయస్సార్ చేస్తే వైయస్ జగన్ ఇప్పుడు తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించడం సరి కాదని ఆయన అన్నారు. రైతుల భూములను సెజ్లో కోసం స్వాధీనం చేసుకున్నారని అంటూ సెజ్లు ముఖ్యమా, రైతులు ముఖ్యమా అని ఆయన అడిగారు. ఆల్మట్టి ఎత్తు పెంపుపై వైయస్సార్ ఏనాడూ ప్రశ్నించలేదని ఆయన అన్నారు.