లక్షలున్న జగన్ కోట్లు ఎలా కూడబెట్టాడు: టిడిపి అధినేత చంద్రబాబు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నియంతలా వ్యవహరించారని అన్నారు. వైఎస్ తన హయాంలో సెజ్ల పేరుతో వేలాది ఎకరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టారని అన్నారు. గిరిజన చట్టాలను తుంగలో తొక్కి లక్షల ఎకరాలు కావాల్సిన వారికి కట్టబెట్టారని ఆరోపించారు. వాన్పిక్ నుండి జగన్ సాక్షికి 750 కోట్ల రూపాయలు ఎలా వెళ్లాయని ఆయన ప్రశ్నించారు. కేవలం 8 లక్షల రూపాయల పెట్టుబడితో 1250 కోట్ల రూపాయల డబ్బును జగన్ ఎలా సృష్టించగలిగారని అన్నారు. రాష్ట్రంలో చాలామంది మధుకొడాలు, రాజాలు ఉన్నారన్నారు. వైఎస్ అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్ వేలకోట్లు సంపాదించారని ఆరోపించారు.
కృష్ణ జలాలను తీసుకు రావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అప్పుల పాలైన రైతులను ఆదుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదన్నారు. రైతుల కోసం మంగళవారం జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. చేనేత కార్మికులకు న్యాయం జరిగే వరకు టిడిపి పోరాటం చేస్తుందన్నారు. ప్రపంచ ఆధునీకరణలో మన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్పుట్ సబ్సిడీపై మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు.