కాంగ్రెసు ప్రభుత్వాలను, చంద్రబాబును దుమ్మెత్తిపోసిన వైయస్ జగన్
ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు ఎక్కడ ఉందో చెప్పడానికే కాకుండా దాని అవసరం తెలియజేయడానికి పాద యాత్ర చేసినట్లు ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కట్టకపోతే రాష్టం ఎడారి అవుతుందని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి 320 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సాకులు చెబుతోందని, వారి కాళ్లావేళ్లా పడాలని అనుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన అన్నారు. 33 మంది పార్లమెంటు సభ్యులను పంపినా ఇన్నిసార్లు ప్రాజెక్టు కోసం వేడుకోవాలా అని ఆయన అడిగారు.
పార్లమెంటు సభ్యులను మన రాష్ట్రం పంపితే మంత్రి పదవులు మాత్రం ఇతర పార్టీలకు ఇస్తున్నారని, రైల్వే మంత్రి పదవి మమతా బెనర్జీకి ఇచ్చారని, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరని ఆయన అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ఐదు నిమిషాల పాటు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఇవ్వలేదని, వ్యవసాయ శాఖ మంత్రిగా మహారాష్ట్ర వ్యక్తికి ఇచ్చారని, అది మనమే ఎందుకు తీసుకోకూడదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ ఎంత సేపైనా మనల్ని వాడుకుంటుంది తప్ప మంచి చేయదని ఆయన విమర్శించారు. కొంత మంది ఎంపిలతో పోలవరం కావాలని, మరి కొంత మందితో వద్దని అనిపిస్తారని ఆయన అన్నారు. పోలవరం వద్దనడానికి కారణాలేమిటని ఆయన ప్రశ్నించారు.
ఏదైనా చేయాలంటే ధైర్యం, చిత్తశుద్ధి ఉండాలని, పోలవరం పూర్తి చేయాలని, ప్రాణహిత - చేవెళ్ల పూర్తి చేయాలని, రెండు ప్రాజెక్టులు పూర్తి చేయకూడదని ఎక్కడైనా ఉందని ఆయన అన్నారు. పదవి ఉన్నప్పుడు, పదవి లేనప్పుడు ఒకే విధంగా ఉండాలని, ఇది చంద్రబాబు గురించి చెబుతున్నానని, రైతుల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో పోలవరం పూర్తి చేసి ఉంటే ప్రతి రైతు ముఖంలో నవ్వులు పూసి ఉండేవని ఆయన అన్నారు. కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును తొక్కిపెట్టాడంటే చంద్రబాబు నైజం గురించి ఆలోచించాలని ఆయన ప్రజలను కోరారు. పోలవరం పూర్తి చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన చెప్పారు.