మావోయిస్టుల బందీగానే వినీల్ కృష్ణ, మధ్యవర్తి హరగోపాల్ ఆగ్రహం
తాము విడుదల చేసిన జేఈ మాఝీ ద్వారా ఒక లేఖలో మావోయిస్టులు మల్కన్గిరి జిల్లా యంత్రాంగానికి పంపారు. ఈ లేఖలో వారు కొత్త డిమాండ్లు పెట్టారు. మల్కన్గిరి కోర్టులో శ్రీరాముల శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ మళ్లీ వాయిదాపడింది. మరో మావోయిస్ట్ట్టు నేత గంటి ప్రసాదానికి బెయిల్ మంజూరైనా మిగతావారు విడుదలయ్యేవరకు జైల్లోనే ఉంటానని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. కలెక్టర్ విడుదల కాకపోవడంతో ఏవోబీలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇద్దరు బందీలను విడుదల చేస్తున్నట్టు అపోహ పడిన అధికారులు అదే అంశాన్ని బయటకు వెల్లడించడంతో మీడియాలో కలెక్టర్, జేఈ విడుదలైనట్టు ప్రచారం జరిగింది. బుధవారం మధ్యాహ్నం చిత్రకొండ చేరుకున్న జేఈ మాఝీతో మావోయిస్టులు ఒక లేఖను జిల్లా అధికారులకు పంపారు.
కిడ్నాప్ చేసిన బోడపాడ సమీపంలోని జనతాబాయ్ ప్రాంతానికి ముగ్గురు మావోయిస్టులు జేఈని వెంటబెట్టుకొని వచ్చి అక్కడ ప్రజలకు అప్పగించారు. ఈ సమాచారాన్ని ముందే తెలుసుకున్న అధికారులు ఆ ప్రాంతానికి కోరుకొండ వీడీవో మహంతికుమార్, ఏపీవో మానసమిత్రతోపాటు మరో ఇద్దరు సర్పంచ్లను పంపారు. ద్విచక్ర వాహనాలపై జేఈని జాన్బాయ్ వరకు తెచ్చి అక్కడనుంచి లాంచీపై చిత్రకొండకు 23 కిలోమీటర్ల దూరంలో గల జాన్బాయ్ ఘాట్ వరకు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తీసుకొచ్చారు.
అక్కడ నుంచి మళ్లీ ద్విచక్ర వాహనంపై ఎస్ఆర్ పైప్లైన్ జంక్షన్ వరకు తీసుకొచ్చి అక్కడనుంచి జీపులో చిత్రకొండ అతిథిగృహానికి చేర్చారు. డీఆర్డీఏ పీడీ బల్వంత్సింగ్ పర్యవేక్షణలో వైద్యులు జేఈకి వైద్య పరీక్షలు జరిపి సుమారు గంటసేపు చర్చించి.. మల్కన్గిరి తరలించారు. జనతాబాయ్ నుంచి ద్విచక్ర వాహనంపై జేఈని తెచ్చేటప్పుడు ఆయనను ఎవరూ గుర్తుపట్టకుండా హెల్మెట్ పెట్టి మరో ఇద్దరు ఎస్కార్ట్గా ఉన్నారు. మావోయిస్టుల ఆధీనంలో కలెక్టర్ సురక్షితంగానే, తనను కలెక్టర్ను ఏమాత్రం వేధించలేదని జేఈ మాఝీ మల్కన్గిరిలో చెప్పారు.