సమయం వచ్చినప్పుడు సోనియా దుమ్ము దులుపుతా: కాకా
తెలంగాణ ఇస్తామనో, ఇవ్వబోమనో చెప్పాలని తాను వర్కింగ్ కమిటీలో పట్టుబట్టానని, వాకౌట్ చేయడానికి సిద్ధపడ్డానని, మొయిలీ, అహ్మద్ పటేల్ తనను ఆపారని ఆయన చెప్పారు. మొయిలీని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా తీసేయడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా పోయినోడి గురించి ఇప్పుడెందుకు అని ఆయన అన్నారు. తెలంగాణపై మే వరకు ఆగాలని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారని, ఈసారి తెలంగాణ ఇవ్వక తప్పదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ఏం చెప్తే తాను అది చేస్తానని ఆయన అన్నారు. తాను తెలంగాణ కోసం మొదటి నుంచి పోరాటం చేస్తూ వస్తున్నానని ఆయన అన్నారు.
తనను వర్కింగ్ కమిటీ నుంచి తొలగించడం సంతోషంగా ఉందని, ఇప్పటికే తాను రాజీనామా చేయాలని అనుకున్నానని, కానీ కొంత మంది ఆపారని ఆయన అన్నారు. సిడబ్ల్యుసి కొత్త సీసాలో పాత సారాలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు పార్టీ తేల్చాల్సిందేనని ఆయన అన్నారు. సీనియర్ నాయకుడిని అయిన తనకు కాంగ్రెసు నాయకులు అన్యాయం చేశారని ఆయన అన్నారు. విభజించి పాలించడంలో గులాం నబీ ఆజాద్ మొనగాడని ఆయన అభిప్రాయపడ్డారు.