రాష్ట్రంలో భారీగా రేషన్ కార్డుల తొలగింపు! కేంద్రం షాకింగ్ ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో రేషన్కార్డుల తొలగింపుపై పార్లమెంట్ లో కీలక ప్రకటన వెలువడింది. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే 2025 సంవత్సరంలో ఊహించని రీతిలో భారీ సంఖ్యలో రేషన్కార్డులను రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హత లేని వారిని ఏరివేసే క్రమంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. అయితే, ఒక్కసారిగా లక్షకు పైగా కార్డులు చెల్లకుండా పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రద్దవుతున్న రేషన్కార్డుల డేటాపై రాజ్యసభలో సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం వివరాలు అందించింది. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిమూబెన్ జయంతిభాయ్ బంభానియా ఈ మేరకు సభకు అధికారిక లెక్కలను సమర్పించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, డిజిటల్ తనిఖీల ద్వారా అనర్హులైన వారిని గుర్తించి తొలగించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి వివరించారు.

గడిచిన నాలుగేళ్ల గణాంకాలు ఇలా..
కేంద్రం విడుదల చేసిన డేటా ప్రకారం తెలంగాణలో గత మూడేళ్లలో జరిగిన మొత్తం ఏరివేత కంటే ఒక్క 2025లోనే అత్యధిక కార్డులు రద్దయ్యాయి.
- 2022 సంవత్సరంలో: 4,988 కార్డులు
- 2023 సంవత్సరంలో: 34,064 కార్డులు
- 2024 సంవత్సరంలో: 3,424 కార్డులు
- 2025 సంవత్సరంలో: 1,04,947 కార్డులు
ఈ మూడేళ్ల కాలంలో కలిపి మొత్తం 42,476 రేషన్కార్డులను అధికారులు తొలగించారు. కానీ, 2025 ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 1,04,947 రేషన్కార్డులను డిలీట్ చేశారు. గత మూడేళ్ల ఉమ్మడి సంఖ్యతో పోలిస్తే ఒక్క ఏడాదిలోనే ఏకంగా 147 శాతం కంటే ఎక్కువ కార్డులు రద్దు కావడం గమనార్హం.
ఏరివేతకు గల ప్రధాన కారణాలు
ఆధార్ సీడింగ్, ఈ-కేవైసీ (e-KYC) తనిఖీలు, బోగస్ ఏరివేత, మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం, ఆదాయ పరిమితి దాటిన వారిని గుర్తించడం వల్లే ఈ స్థాయిలో కార్డుల రద్దు ప్రక్రియ వేగవంతమైంది. ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS)లో పారదర్శకత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, సాంకేతిక లోపాల వల్ల నిజమైన పేదలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.














Click it and Unblock the Notifications