అసెంబ్లీలో చంద్రబాబుకు ఎదురు తిరిగిన జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలు
తెలుగుదేశం సభ్యులకు దీటుగా జగన్ వర్గం ఎమ్మెల్యేలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. జగన్ వర్గానికి చెందిన 11 మంది శాసనసభ్యులు చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. తెలుగుదేశం సభ్యులకు అనూహ్యమైన ఎదురు దాడి ఎదురైంది. దాంతో డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను అర గంట పాటు వాయిదా వేశారు.
భూ కేటాయింపులపై సభా సంఘం వేయాల్సిందేనని తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు డిమాండ్ చేశారు. జగన్ వర్గం శాసనసభ్యులపై తెలుగుదేశం శాసనసభ్యులు మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేసి ప్రజల ముందుకు రావాలని వారు డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలోని వ్యవహారాలపై ఎన్నో కమిటీలు వేశారని, అవినీతిని నిరుపించారా అని వారన్నారు. చంద్రబాబు హయాం నుంచి జరిగిన భూకేటాయింపులపై సభా సంఘం వేయాలని వారు డిమాండ్ చేశారు.