తెలంగాణపై వైయస్ జగన్ బూచీ, సోనియాకు ముందస్తు హెచ్చరికలు

ఇంతకు ముందు తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండ రామ్ ఆ వాదనను ముందుకు తెస్తే, బుధవారం కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకుడు టి. జీవన్ రెడ్డి అటువంటి వాదననే ముందుకు తెచ్చారు. కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే, తెలంగాణలో కాంగ్రెసు నాయకులు వైయస్ జగన్ వైపు వెళ్తారని కోదండరామ్ చెప్పారు. తమ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణలో వైయస్ జగన్ బలం పుంజుకుంటారని జీవన్ రెడ్డి అన్నారు. ఇటువంటి వాదనలు ఇక ముందు మరింతగా పుంజుకునే అవకాశం ఉంది.
తెలంగాణపై ఇప్పటి వరకు వైయస్ జగన్ తన వైఖరిని ప్రకటించలేదు. జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని కొండా సురేఖ వంటి జగన్ వర్గం తెలంగాణ నాయకులు చెబుతూ వస్తున్నారు. తాము తెలంగాణ కోసం పోరాడుతామని కూడా చెబుతున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆలోచన మరో విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. 2014 ఎన్నికల వరకు కూడా కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై ప్రకటన చేయకపోతే, లేదంటే తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే వైయస్ జగన్తో అవగాహనకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సీమాంధ్రలో ఆధిక్యత సాధిస్తే, తాము తెలంగాణలో ఆధిక్యత సాధిస్తామని, తద్వారా జగన్తో కలిసి తెలంగాణ కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కెసిఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications