కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ముప్పు తప్పదా, ఆగస్టు సంక్షోభానికి తెర?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ముప్పు తప్పదనే వార్తలు వస్తున్నాయి. ఆయనపై కాంగ్రెసు వర్గాల్లో క్రమక్రమంగా అసంతృప్తి పేరుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కూల్చడానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాయి. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడంపై తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కాంగ్రెసుతో కుమ్మక్కు కావడం వల్లనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని, కుమ్మక్కు కావడం వల్లనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ అపవాదు నుంచి బయటపడడానికైనా ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ముందుకు రావచ్చు. బహుశా, శాసనసభా వర్షాకాల సమావేశాల్లో అవిశ్వాసం ప్రతిపాదించవచ్చునని అంటున్నారు.

ముఖ్యమంత్రి తీరుపై బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ మంత్రులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రుల మధ్య సయోధ్య కూడా లేదు. మహబూబ్నగర్ జిల్లా మంత్రులు డికె అరుణ, జూపల్లి కృష్ణా రావు మధ్య తలెత్తిన వివాదం కూడా కిరణ్ కుమార్ రెడ్డి మెడకు చుట్టుకున్నట్లు చెబుతున్నారు. మంత్రులపై, పాలనపై కిరణ్ కుమార్ రెడ్డికి పట్టు లేదని, పట్టు సాధిస్తారనే నమ్మకం లేదని అంటున్నారు. ఈ స్థితిలో ప్రభుత్వ తీరు వల్ల పార్టీ తీవ్రంగా దెబ్బ తినే ప్రమాదం ఉందని అంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ఆయుధాన్ని ప్రయోగించి ప్రభుత్వాన్ని కూల్చడానికి సమాయత్తమవుతున్నాయి. ఈ స్థితిలో ఆగస్టు సంక్షోభం తప్పదనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications