సిఎం పదవి: చిరంజీవితో బొత్స సత్యనారాయణ పోటీ

పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెర మీదికి రావడానికి బొత్స సత్యనారాయణ చేయాల్సిందంతా చేస్తున్నారు. చిరంజీవి మాత్రం పూర్తిగా కాంగ్రెసు పార్టీ అధిష్టానం మీద ఆధారపడ్డారు. వచ్చే ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెసుకు స్టార్ కాంపైనర్ అవుతారనే మాట వినిపిస్తోంది. ఆ అవకాశాలు మెండుగానే ఉన్నాయి. కానీ, ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరంజీవి పేరును పార్టీ అధిష్ఠానం ప్రకటిస్తుందా అనేది అనుమానమే. ఒకవేళ అలా ప్రకటించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే అడ్డుపడేవాళ్లు చాలా మందే ఉంటారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడంతో రెడ్లు కాంగ్రెసు పార్టీకి దూరమవుతున్నారనే అభిప్రాయం ఉంది. రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినా ఆ సామాజిక వర్గాన్ని కూడగట్టడంలో, వైయస్ జగన్ వైపు వెళ్లకుండా నిరోధించడంలో విఫలమయ్యారని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రత్యామ్నాయంగా కాపు సామాజిక వర్గాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో చిరంజీవికి, బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యం లభించినప్పటికీ ముఖ్యమంత్రి పదవికి వచ్చేసరికి వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు విజయం సాధిస్తే మాత్రమే పోటీ పడడానికైనా అవకాశం ఉంటుందనేవారు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications