అసెంబ్లీలో అర్ధరాత్రి నాగం బృందం హల్ చల్
మొదట రాత్రి 11 గంటల సమయంలో చర్చలు జరుపుతామంటూ ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలు ఉన్న గదిలోకి అసెంబ్లీ కార్యదర్శి వెళ్లారు. ఆయన వెంటే పోలీసులూ లోపలికి దూసుకెళ్లారు. దీంతో, విషయాన్ని గ్రహించిన నాగం జనార్దన్రెడ్డి స్పీకర్ యాంటీ రూమ్లోకి వెళ్లి గడియ వేసుకున్నారు. దీంతో, అక్కడే ఉన్న జోగు రామన్న, హరీశ్వర్రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని మీడియా కన్నుగప్పి మొదటి గేటు నుంచి బయటకు తరలించారు. ఆ తర్వాత, డిసిపి అకున్ సబర్వాల్ నేతృత్వంలోని పోలీసుల బృందం స్పీకర్ చాంబర్లోని యాంటీ రూమ్ తలుపులను పగులగొట్టింది. నాగంతోపాటు అక్కడే ఉన్న వేణుగోపాలచారిలను బయటకు తరలించింది.
అసెంబ్లీలో బైఠాయించిన ఎమ్మెల్యేలను అరెస్టు చేస్తున్నారన్న సమాచారం అందుకున్న తెలంగాణ న్యాయవాదుల ఐకాస, తెలంగాణ నగారా నాయకులు అక్కడికి చేరుకున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో, పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్టు చేశారు.