రాష్ట్రంలో అవిశ్వాసం వేడి, ఏ పార్టీ బలమెంత?

టిఆర్ఎఎస్ ఎమ్మెల్యేలు మద్దతిస్తామని చెప్పినప్పటికీ చిత్తశుద్ధితో పెడితే మద్దతిస్తామని చెప్పింది. ఈ విషయం పక్కన పెడితే కెసిఆర్ అనూహ్యంగా టిఆర్ఎస్ఎల్పీలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సమావేశాలలోగా సోనియా గాంధీ తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. దీంతో టిఆర్ఎస్ మద్దతు ప్రశ్నార్థకంగా మారిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ అవిశ్వాసానికి మద్దతిస్తామని చెప్పిన టిఆర్ఎస్ ఈ రోజు కూడా అదే చెప్పింది. మద్దతివ్వమని ఎక్కడా ప్రకటించలేదు కానీ కెసిఆర్ వ్యాఖ్యలే పలువురిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక జగన్ వర్గం నేతలు ఎవరికి మద్దతిస్తారనే విషయంలోనూ చర్చ జరుగుతోంది. ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెసువైపు వస్తున్నారు. ఇప్పటికే అధికారికంగా ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెసు వైపే ఉంటామని ప్రకటించారు.
ఆదినారాయణ రెడ్డి వంటి వారు కాంగ్రెసుతో పాటు జగన్కు మద్దతిస్తామని చెప్పడం విశేషం. దీంతో జగన్ ఎమ్మెల్యేలు టిడిపికి మద్దతిస్తారా లేక కాంగ్రెసుకు అనుకూలంగా ఓటు వేస్తారా అనే సస్పేన్షన్ కొనసాగుతోంది. ప్రభుత్వం కూడా జగన్ ఎమ్మెల్యేలను నమ్మినట్లుగా కనిపించడం లేదు. వారు ఎటైనా మద్దతివ్వవచ్చని ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అవిశ్వాసం ప్రవేశ పెడితే జగన్ వర్గంతో సహా తమ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక తెలంగాణ అంశంపై కూడా ఎవరి వ్యూహాలు వారు రచించుకుంటున్నారు. తెలంగాణ టిడిపికి సమావేశాలు బైకాట్ చేస్తే తాము మరోవిధంగా, సెషన్స్లో ఉంటే ఇంకో విధంగా వ్యవహరించాలని తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు.
ఇక టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, టిడిపిని టార్గెట్ చేసుకొని తీర్మానం పెట్టాలని డిమాండ్ చేయనుంది. తెలంగాణపై టిడిపిని దోషిగా నిలబెట్టాలని టి-కాంగ్రెసు భావిస్తుండగా, టిఆర్ఎస్, కాంగ్రెసును ఎండగట్టాలని టిటిడిపి యోచిస్తోంది. ఇక టిఆర్ఎస్ కాంగ్రెసును, ప్రధానంగా టిడిపిని లక్ష్యంగా చేసుకొని ఫైట్ చేయాలని భావిస్తోంది. మొత్తానికి ఈ శీతాకాల సమావేశాలు హాట్ హాట్గా జరగనున్నాయి. ఇక బలం విషయానికొస్తే ప్రజారాజ్యం, ఎంఐఎం మద్దతుతో గట్టెక్కొచ్చని చూస్తోంది. ఇన్నాళ్లూ సవాల్ విసిరినందున టిఆర్ఎస్, జగన్ ఎమ్మెల్యేలు వారితో పాటు లోక్సత్తా, బిజెపి, సిపిఐ మద్దతుపై ఆశలు పెట్టుకుంది. అయితే టిఆర్ఎస్, జగన్ ఎమ్మెల్యేలను మాత్రం పూర్తిగా నమ్మడం లేదు.
జగన్ వర్గానికి చెందిన 26 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేల్లో పదిహేను నుండి ఇరవై మంది వరకు కాంగ్రెసుకు మద్దతి ఇచ్చే అవకాశముంది. ఒకవేళ వారి నుండి మద్దతి లేకున్నప్పటికీ పిఆర్పీ(17, శోభానాగిరెడ్డిని మినహాయించి), ఎంఐఎం(7) మందితో గట్టెక్కవచ్చని భావిస్తోంది. తెలంగాణ సెంటిమెంటు కారణంగా ఇద్దరు పార్టీకి దూరమైనా అధికారికంగా ప్రకటించిన జగన్ వర్గం ఎమ్మెల్యేలు ముగ్గురు మాత్రం ప్రభుత్వానికి అండగా నిలువనున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి మద్దతుంటుందని చెప్పడం, సెంటిమెంటుతో బయటకు వెళ్లిన వారి రాజీనామాలు స్పీకర్ ఆమోదించడం వల్ల కిరణ్ ప్రభుత్వం గట్టెక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పీఆర్పీ, ఎంఐఎం మద్దతిస్తున్నందు వల్ల తమ పార్టీకి చెందిన 155 మంది ఎమ్మెల్యేల్లో జగన్ వర్గం ఎమ్మెల్యేలు 23 మంది వెళ్లినా, రాజీనామాలు చేసిన వారిని మినహాయించుకున్నా అవిశ్వాసాన్ని ఎదుర్కోవచ్చునని ప్రభుత్వం కూడా భావిస్తోంది.












Click it and Unblock the Notifications