మాటలు కాదు, బాలయ్య చేతల్లో చూపాలి: లగడపాటి
సామాజిక న్యాయం కోసమే చిరంజీవి కాంగ్రెసు పార్టీలో చేరారని ఆయన అన్నారు. విశాల భావనతో, జాతీయ దృక్పథంతో భారతీయుడిగా ఆలోచించి కాంగ్రెసు పార్టీలో చేరారని ఆయన అన్నారు. చిరంజీవి మాట తూలని వ్యక్తి అని, సహృదయుడని ఆయన అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో చిరంజీవి పార్టీ స్థాపించారని ఆయన అన్నారు. అయితే, పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ, చంద్రబాబు తమ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసినా గత ఎన్నికల్లో సోనియా గాంధీ నాయకత్వంపై విశ్వాసంతో, తమకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రజలు కాంగ్రెసు పార్టీని గెలిపించారని ఆయన అన్నారు.
చిరంజీవికి గత ఎన్నికల్లో 18 శాతం ఓట్లు వచ్చాయని, అవి తక్కువేమీ కాదని ఆయన అన్నారు. చంద్రబాబు ఒక శాతం ఓట్లు కూడా లేని కమ్యూనిస్టు పార్టీలతో, మూడు నాలుగు శాతం ఓట్లు కూడా లేని తెలంగాణ రాష్ట్ర సమితితో కాళ్లావేళ్లా పడి పొత్తు కుదుర్చుకున్నారని ఆయన అన్నారు. నిజానికి, ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ రెండో స్థానంలో ఉందని, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చంద్రబాబు కలర్ టీవీల ఆఫర్ వల్లనో, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం వల్లనో తెలుగుదేశం పార్టీ రెండో స్థానంలోకి వచ్చిందని ఆయన చెప్పారు.
చిరంజీవి పదవుల కోసం అమ్ముడుపోయారని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. చిరంజీవి బేషరతుగా పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారని, కాంగ్రెసు తన బాధ్యతగా గుర్తించి ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు మంత్రి పదవులు ఇచ్చిందని, చిరంజీవికి కూడా తగిన స్థానం కల్పించిందని ఆయన అన్నారు. అజిత్ సింగ్ లాగా చిరంజీవికి వెంటనే కేంద్ర మంత్రి వర్గంలో చేరే అవకాశం ఉండిందని, కానీ చిరంజీవి అలా చేయలేదని ఆయన అన్నారు. తమ పార్టీ నాయకులు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారనే తెలుగుదేశం పార్టీ నాయకుల విమర్శలను ఆయన ఖండించారు.