వైయస్ జగన్ కుమ్మక్కు వ్యాఖ్యల వ్యూహం ఫలిస్తోందా?
చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డితో కుమ్మక్కయ్యారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా అంటున్నారు. అందుకు ఆయన మరో నిదర్శనాన్ని చూపిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పట్టుబట్టి ఐదు వేల మంది సిబ్బందితో భద్రత కల్పించి ఉండకపోతే చంద్రబాబు వరంగల్ జిల్లాలో పర్యటించి ఉండేవారు కాదని ఆయన అంటున్నారు. కనీవినీ ఎరుగుని రీతిలో చంద్రబాబు పర్యటనకు భద్రత కల్పించడమే కుమ్మక్కు నిదర్సనమని ఆయన అంటున్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ ఉప ఎన్నికలో తమ పార్టీ ఓట్లన్నీ కాంగ్రెసుకు వేయించారని, ఇది కూడా చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డితో కుమ్మక్కయ్యారని చెప్పడానికి నిదర్శనమని ఆయన అన్నారు. పదవిని కాపాడుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబుతో కుమ్మక్కయ్యారనే విమర్సలు కూడా వస్తున్నాయి.
ఇక, వైయస్ జగన్పై పోరాటం చేస్తున్నందుకే పి. శంకరరావును మంత్రి వర్గం నుంచి తొలగించారని, డిఎల్ రవీంద్రా రెడ్డికి ప్రాధాన్యం లేకుండా చేశారని ముఖ్యమంత్రిపై విమర్శలు వస్తున్నాయి. జగన్ పట్ల మెతక వైఖరి అవలంబించాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం మేరకే కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా పెద్ద యెత్తునే సాగుతోంది. కిరణ్ కుమామర్ రెడ్డికి ఇటువంటి ప్రచారాలు తీవ్రమైన వ్యతిరేకతగా పరిణమించవచ్చునని అంటున్నారు. ఈ రకంగా వైయస్ జగన్ వ్యూహం ఫలించి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలపడుతుందని అంటున్నారు.