థర్డ్ ఫ్రంట్ తెలంగాణకు దెబ్బనే, విభజన వ్యతిరేకులే
మూడో కూటమి ఏర్పడితే గనుక వామపక్షాలు కూడా అందులో చేరే అవకాశాలున్నాయి. సిపిఐ, సిపిఎంలతో పాటు ఇతర పార్టీలు కొన్ని అందులో భాగం పంచుకుంటాయని అర్థమవుతూనే ఉన్నది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా వస్తారనే ఆశ చంద్రబాబు లాంటి నాయకులకు ఉంది. మమతా బెనర్జీ నాయకత్వంలోని మమతా బెనర్జీని కూడా కూడగట్టుకునే ప్రయత్నాలు సాగుతాయని అనుకోవచ్చు. అయితే, సిపిఎం, తృణమూల్ కాంగ్రెసు కలిసి పనిచేస్తాయా అనేది ఓ ప్రశ్న.
మొత్తంగా మూడో కూటమి తెలంగాణ వ్యతిరేక, లేదంటే విభజన వ్యతిరేక పార్టీలతో ఏర్పడే అవకాశాలున్నాయి. సమాజ్వాదీ పార్టీ ఎన్నికల ప్రచారంలో యుపి విభజనను వ్యతిరేకించడాన్ని ప్రధానాంశంగా ముందుకు తేకపోయినా తాము విభజనకు వ్యతిరేకమనే విషయాన్ని విజయం తర్వాత అఖిలేష్ యాదవ్ స్ఫష్టంగా చెప్పారు. కూటమిలో చేరబోయే చంద్రబాబు లేదా జగన్ కూడా తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తోంది. సిపిఐ మాత్రమే అనుకూలంగా ఉంది. అయితే, ఇతర రాజకీయాల కోసం తెలంగాణ అంశాన్ని సిపిఐ పక్కన పెట్టే అవకాశాలు లేకపోలేదు. మమతా బెనర్జీ కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. అందువల్ల దేశ రాజకీయాల్లో మూడో ఫ్రంట్ ఆధిపత్యంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ వెనక్కి వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.