వైయస్కు శంకర్రావు కితాబు, జగన్ అరెస్ట్పై జెడి వ్యాఖ్య
దళితులకు వైయస్ అన్యాయం చేశారంటే తాను అంగీకరించబోనని శంకర్ రావు చెప్పారు. వైయస్ కుటుంబంలోనే దళితులు ఉన్నారని గుర్తు చేశారు. పార్టీలో సీనియర్లను కాదని దళితులైనందునే ప్రభుత్వ చీఫ్ విప్గా మల్లు భట్టి విక్రమార్క, విప్లుగా శైలజానాథ్, కొండ్రు మురళీ మోహన్లను వైయస్ నియమించారని చెప్పారు. దళితులు, దళిత క్రిస్టియన్లు ఇప్పటికే జగన్ వెంట వెళ్తున్నారని ఇలాంటి సమయంలో ఈ విధమైన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుస్తాయన్నారు.
వైయస్ను తాను దళిత ద్రోహి అని విమర్శించలేదని రాజ్యసభ సభ్యుడు జెడి శీలం గుంటూరులో స్పష్టం చేశారు. అలా తాను అన్నట్లు జరిగిన ప్రచారంపై బుధవారం ఆయన గుంటూరులో వివరణ ఇచ్చారు. వైయస్ పాలన దళితులకు స్వర్ణ యుగంగా వైయస్సార్ కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రచారం చేస్తున్నారని శీలం ఆక్షేపించారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైయస్ సిఎంలుగా ఉన్న 1994-2009 మధ్య రాష్ట్రంలో రూ.13 వేల కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లాయని, ఆ అంశంపైనే తాను విమర్శలు చేశానని చెప్పారు.
జగన్ అరెస్టుపై విలేకరులు ప్రశ్నించగా, ఆయనపై సిబిఐ విచారణ జరుగుతోందన్నారు. దీనిపై నేను జడ్జిమెంట్ ఇవ్వలేనని చెప్పారు. నాకు కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు ముఖ్యమని, దీంతో పాటు దళితుల ఐక్యత కోరుతున్నానని చెప్పారు.వారు విద్యావంతులు కావాలని, నేను ప్రబోధం చేయలేదని, వాస్తవాలను వివరించాలని ప్రయత్నిస్తున్నాననిజెడి శీలం చెప్పారు.