ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణానికి స్మార్ట్ కార్డులు.. ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'మహాలక్ష్మి' పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డును చూపించి జీరో టికెట్ పొందుతుండగా, ఇకపై ఆ అవసరం లేకుండా ప్రత్యేక 'స్మార్ట్ కార్డులను' జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది.
స్మార్ట్ కార్డుల జారీ - ప్రత్యేకతలు
ప్రభుత్వం అందించబోయే ఈ స్మార్ట్ కార్డులు చూడటానికి ఏటీఎం లేదా డెబిట్ కార్డు తరహాలో ఉంటాయి. ఇందులో భద్రత కోసం ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ చిప్ను అమరుస్తారు.
లబ్ధిదారులైన మహిళల ఆధార్ వివరాలు, వారి ఫోటోను సేకరించి ఈ చిప్తో లింక్ చేస్తారు. బస్సులో ప్రయాణించేటప్పుడు కండక్టర్లు ఈ స్మార్ట్ కార్డును స్కాన్ చేసి నేరుగా ఉచిత టికెట్లను జారీ చేస్తారు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది.

ఏదైనా ఆర్టీసీ డిపో పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్డులను పంపిణీ
ముందుగా సాంకేతిక లోపాలను గుర్తించడానికి ఏదైనా ఒక నిర్దిష్ట ఆర్టీసీ డిపో పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్డులను పంపిణీ చేయనున్నారు. అక్కడ విజయవంతం అయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఉచితంగా అందజేస్తారు. స్మార్ట్ కార్డుల తయారీ మరియు పంపిణీకి అయ్యే ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీకి అవసరమైన నిధులను విడుదల చేసింది.
జూన్ నుండే కార్డుల పంపిణీకి కసరత్తు చేస్తున్న సర్కార్
ఈ జూన్ నెల నుంచే కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2023 డిసెంబర్ 9న ప్రారంభమైన ఈ మహాలక్ష్మి పథకానికి మహిళల నుండి భారీ స్పందన లభించింది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిలో దాదాపు 65 శాతం మంది మహిళలే ఉంటున్నారు. ఈ పథకం రాకముందు బస్సుల్లో అక్యుపెన్సీ రేషియో 70 శాతంగా ఉండగా, ఇప్పుడది ఏకంగా 120 శాతానికి పెరగడం గమనార్హం.
ఆర్టీసీ జీరో టికెట్ ఇబ్బందులకు చెక్
ఈ కొత్త స్మార్ట్ కార్డుల విధానం వల్ల చిల్లర సమస్యలు, ఆధార్ వెరిఫికేషన్ ఇబ్బందులు పూర్తిగా తప్పనున్నాయి. ఇది మహిళలకు సంతోషం కలిగించే విషయం. ఆర్టీసీకి కూడా ఉచిత బస్సు టికెట్ లను ఇవ్వటంలో ఎదురవుతున్న ఇబ్బంది తొలగిపోతుంది.













Click it and Unblock the Notifications