మోహన్ లాల్ అప్ కమింగ్ ఫిల్మ్ తెచ్చిపెట్టిన తంటా
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ పరిసరాలలో చలనచిత్రాల షూటింగులపై కేరళ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై శబరిమల పుణ్యక్షేత్రం పరిధిలో ఎలాంటి కమర్షియల్ సినిమాల చిత్రీకరణకు అనుమతులు మంజూరు చేయబోమని కేరళ దేవస్వం శాఖ మంత్రి కే మురళీధరన్ స్పష్టం చేశారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న అతిమనోహరం సినిమా షూటింగ్కు అనుమతులు లభించడం వివాదానికి దారితీయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది.
ఈ వ్యవహారంపై మంత్రి విలేకరులతో మాట్లాడారు. శబరిమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సాధారణ సినిమా షూటింగ్ లొకేషన్గా మార్చడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఆలయ పవిత్రత, అక్కడి వాతావరణాన్ని కాపాడటం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని వ్యాఖ్యానించారు. అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర లేదా పూర్తి భక్తి నేపథ్యం ఉన్న చిత్రాలకు మాత్రమే కఠిన నిబంధనలతో కూడిన ప్రత్యేక అనుమతులు ఇస్తామని వివరించారు. అంతేకానీ ఇతర కమర్షియల్ చిత్రాలకు దేవాలయ విలువులను పణంగా పెట్టలేమని స్పష్టం చేశారు.

ప్రముఖ దర్శకుడు తరుణ్ మూర్తి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం.. అతిమనోహరం. మోహన్ లాల్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. కథానుసారంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను పంబ నుంచి సన్నిధానం వరకు చిత్రీకరించాలని యూనిట్ భావించింది. అనుమతుల కోసం ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుకు దరఖాస్తు చేసుకుంది.
దీన్ని పరిశీలించిన అనంతరం బోర్డు కొన్ని కఠిన షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేసింది. ఈ అనుమతుల ప్రకారం ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా, భక్తుల అసంతృప్తికి లోనుకాకుండా నిబంధనలు పాటించాల్సి ఉంది. దేవస్వం బోర్డు ప్రాథమిక అనుమతులు మంజూరు చేసినప్పటికీ.. ఈ ప్రాంతం మొత్తం కూడా అటవీ శాఖ పరిధిలోకి రావడంతో ఆ విభాగం నుంచి కూడా తుది అనుమతి పొందాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే శబరిమల అటవీ పరిసర ప్రాంతాలలో షూటింగ్కు అక్కడి అటవీ అధికారులు పచ్చజెండా ఊపలేదు. దీంతో ఈ చిత్ర యూనిట్ అక్కడ చిత్రీకరణను కొనసాగించలేకపోయింది. ఓ ప్రఖ్యాత పుణ్యక్షేత్రంలో కమర్షియల్ సినిమాలకు అసలు బోర్డు ఎలా అనుమతిస్తుందనే ప్రశ్నలు అటు శబరిమల భక్తులు, ఇటు రాజకీయ నేతల నుంచి వ్యక్తం అయ్యాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న 'అతిమనోహరం' సినిమాలో లాలు అలెక్స్, మనోజ్ కే జయన్, జగదీష్, ఇర్షాద్, సుధీష్, ప్రమోద్ వెలియనాడ్ వంటి నటీనటులు ఇతర కీలక పాత్రలు పోషిస్తోన్నారు. ఇప్పటికే కొచ్చి, తోడుపుజ పరిసర ప్రాంతాల్లో మేజర్ షూటింగ్ పార్ట్ పూర్తయింది. మిగిలిన ముఖ్యమైన షెడ్యూల్స్ శబరిమలతో పాటు హైదరాబాద్, ముంబై నగరాలలో ప్లాన్ చేశారు. శబరిమలలో అనుకోకుండా షూటింగ్ నిలిచిపోవడంతో చిత్ర నిర్మాణ బృందం ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెదుక్కునే పనిలో పడింది.














Click it and Unblock the Notifications