హే రామ్.. రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు: ప్రజలు ఎవరిని నమ్మాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు సంధించారు. పోలీసుల వాహనంలో పెద్ద ఎత్తున గంజాయి, మద్యం బాటిళ్లు కనిపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇది ఉదాహరణ అని పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన ఓ సుదీర్ఘ ట్వీట్ పెట్టారు. అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే, వాటిలోనే అవినీతి చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలని నిలదీశారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద జరిగిన దాన్ని ఓ సాధారణ ఘటనగా కొట్టిపారేయలేమని జగన్ అన్నారు.

రెండేళ్లుగా వ్యవస్థలను ప్రజలకోసం కాకుండా రాజకీయ కక్షసాధింపులు, ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి, రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఎమ్మెల్యేలతో కలిసి కలెక్షన్లు తెచ్చిపెట్టుకోవడానికి వాడుకుంటోన్నారని విమర్శించారు. దాని ఫలితమే ఈ పతనం అని పేర్కొన్నారు. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలు, కలెక్షన్లకు వాడుకుంటే చివరకు అవి ఎంతగా భ్రష్టుపడతాయో ఈ ఘటన కళ్లకు కడుతోందని అన్నారు.
శంఖవరప్పాడు ఘటనలో చివరకు అక్కడున్న ప్రజలే జర్నలిస్టులుగా మారి, జరిగిన ఘటనను వీడియో తీసి వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారని, వీడియోలు తీయొద్దు, కేసులు పెడతామంటూ అని అక్కడకు చేరుకున్న మరో సీఐ బెదిరించడాన్ని బట్టి చూస్తేంటే.. రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలనలో పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోందని జగన్ చెప్పారు. నిజాన్ని బయటపెట్టడమే నేరం, ప్రశ్నించడమే తప్పుగా మారిందని వ్యాఖ్యానించారు.
ఈ ఇద్దరు పోలీసు అధికారులు ప్రైవేటు పార్టీలు నిర్వహించారని, మద్యం, గంజాయి అక్కడ వాడారని, ఆ పార్టీలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారన్న సమాచారం మరింత దిగ్భ్రాంతి కలిగిస్తోందని జగన్ అన్నారు. ఘటనా స్థలం నుంచి కారులో ఉన్న ఆ ఇద్దరు పోలీసు అధికారులను స్థానిక టీడీపీ నాయకులు తప్పించారన్న ఆరోపణలు కూడా అత్యంత తీవ్రమైనవిగా పరిగణించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థతో అధికార పార్టీ నాయకుల కుమ్మక్కు ఎంత లోతుకు వెళ్లిందో ఈ ఘటన బయటపెడుతోందని, అలాంటప్పుడు రాష్ట్రంలో పోలీస్స్టేషన్లలో కేసుల నమోదు నుంచి విచారణ వరకు నిష్పక్షపాతంగా జరుగుతుందని ఎవరైనా నమ్ముతారా అని అన్నారు. రోజూ గంటలకొద్దీ పైకి నీతి కబుర్లు చెబుతూ లోపల రాజకీయ కుట్రలు, కక్షసాధింపులతో వ్యవస్థలను విషపూరితం చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని గుర్తు చేశారు.
రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, వారిని వేధించడం మీద చూపిస్తోన్న శ్రద్ధలో కనీసం కొంతైనా శాంతిభద్రతలు, పోలీసు వ్యవస్థ ప్రక్షాళనపై పెట్టాలని హితవు పలికారు. ఈ ఘటనను కూడా మీడియా బలంతో కప్పిపుచ్చవద్దని, డైవర్ట్ చేయొద్దని అన్నారు. నిష్పక్షపాత విచారణ జరిపించి, తప్పుచేసినవారు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.













Click it and Unblock the Notifications