కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం.. 25 మందికి గాయాలు.. ఐదుగురికి సీరియస్..
జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొన్న ఘటనలో 20 మంది వరకు గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్యాబిన్ లో ఇరుక్కున్న లారీ డ్రైవర్ ను స్థానికులు అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు. గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ మేరకు జగిత్యాల కలెక్టర్, ఎస్పీతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని అధికారులకు పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
మరోవైపు కొండగట్టు ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. "కొండగట్టు సమీపంలో లారీ- బస్సు ఢీకొన్న ఘటన తీవ్రంగా కలచివేసింది. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించడంతో పాటు, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రమాదానికి గల కారణాలను గుర్తించి, కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నాను.. అని బండి సంజయ్ పేర్కొన్నారు.

ఇక ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలు కాగా, క్షతగాత్రుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మందికిపైగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడకు మల్యాల సీఐ రాజ్ కుమార్ చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఇటీవల సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications