చేప మందు పంపిణీలో తొక్కిసలాట, ఒకరి మృతి
చేప మందు కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి అస్తమా బాధితులు గురువారం రాత్రే మైదానం వద్దకు చేరుకున్నారు. ఉదయానికి వేల సంఖ్యలో అయ్యారు. గేటు తీయడం ఒక్కసారిగా లోనికి వచ్చే ప్రయత్నాలు చేయడం జరగటంతో తొక్కిసలాట జరిగింది. సుమారు ఇరవై మందికి ఈ ఘటనలో గాయాలయ్యాయి. వారిని పోలీసులు నియంత్రించలేక పోయారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. అతను మహారాష్ట్రకు చెందిన ఘోరక్ పాటిల్గా తెలుస్తోంది. కాగా తొక్కిసలాట కారణంగా మృతి చెందిన వార్తలను అధికారులు కొట్టి పారేస్తున్నారు.
చేప మందు వేయడం కోసం అన్ని ఏర్పాట్లు పక్కాగా చేశామని బత్తిని సోదరులు ప్రకటించారు. అయినా తొక్కిసలాట జరగడం బాధాకరం. కాగా రాజేంద్ర నగర్లోని కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్సులో చేమందు ప్రసాదం కోసం ప్రజలు భారీగా తరలి వచ్చారు. దీంతో పోలీసులు ఆరాంఘర్ నుంచి దర్గా నగర్ వరకు ట్రాఫిక్ను ఆపి ఓల్డ్ కర్నూలు రోడ్డు మీదిగా మళ్లించారు.
వేదిక వద్ద బయట గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది గంటల తర్వాత చేపమందు పంపిణీ ప్రారంభమైంది. ఈ చేప మందు కోసం మన రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీగా జనాలు వచ్చారు. అయితే వీరికి సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచినీరు, ఆహారం సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్సులో కాకుండా ఇప్పుడు ఇక్కడకు స్థలం మార్చడం కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది.