పరకాల ప్రభాకర్కు తెలంగాణ సెగ: వివాదాల రొద
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ నేతృత్వంలో ఈ సమావేశం ఏర్పాటైంది. పలువురు తెలంగాణ ప్రాంత నాయకులు, విశాలాంధ్ర మహాసభ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్టాన్ని విభజించాలనేవాళ్లు ఒక్క కారణం చెప్తే తాము కలిసి ఎందుకు ఉండాలనే దానికి వంద కారణాలు చెప్తానని పరకాల ప్రభాకర్ అన్నారు. దీనికి తెలంగాణవాదులు తీవ్ర అభ్యంతరం చెప్పారు.
తెలంగాణలో ఆత్మహత్యలకు తెలంగాణ నాయకత్వమే కారణని పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యపై కూడా తెలంగాణవాదులు మండిపడ్డారు. దీనిపై కూడా వాగ్వివాదం జరిగింది. ఉద్యమ నాయకత్వం, స్వరూపం మారాలని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు సీమాంధ్ర పెట్టుబడిదారులు, తెలంగాణ ద్రోహులు లక్ష్యంగా ఉద్యమం సాగాలని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడే రాష్ట్ర విభజన సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక రాష్ట్రం విషయంలో తమ పార్టీ ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసిందని, మళ్లీ అడిగినా చెప్తామని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణపై త్వరలో తమ పార్టీ మరింత స్పష్టత ఇస్తుందని, ఇప్పటికే అన్ని ప్రాంతాల నాయకులతో తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారని ఆయన చెప్పారు.
రాష్ట్రపతి ఎన్నిక ముగిసిన వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని కొండా లక్ష్మణ్ బాపూజీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం తీవ్రంగా ఉంటుందని, రెండు రోజుల్లో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన అన్నారు.