టిడిపి ఎమ్మెల్యేల ధర్నా, అరెస్టు: యాష్కీ హెచ్చరిక
ఇదిలావుంటే, ఫీజు రీయంబర్స్మెంట్ వ్యవహారంపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ను యధాతథంగా అమలు చేయకపోతే తాను ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ఆయన చెప్పారు. ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వివరిస్తామని, కిరణ్ కుమార్ రెడ్డి వినకపోతే పార్టీ అధిష్టానానికి చెబుతామని, అప్పుడు కూడా పరిష్కారం కాకపోతే తాను ఆమరణ దీక్షకు దిగుతానని ఆయన వివరించారు.
ఇదిలావుంటే, ఫీజు రీయంబర్స్మెంట్పై మంత్రి వర్గ ఉప సంఘం సమావేశమైంది. ఖమ్మం జిల్లా ఇందిరమ్మ బాటలో ఉన్న ముఖ్యమంత్రి వచ్చిన తిరిగి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమావేశం వాయిదా పడింది. ఫీజు రియంబర్స్మెంట్, ఫీజు విధానంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైంది. ఫీజు ఎంతో తెలియకుండా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించడం వల్ల తలెత్తే సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికే న్యాయసలహా కోరింది.
అడ్వకేట్ జనరల్ నుంచి దీనికి సంబంధించిన నివేదిక అందకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రేపటి సమావేశంతో పాటు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశాన్ని ఉప సంఘం పరిశీలిస్తోంది. కాగా, మంత్రి పితాని సత్యనారాయణ బిసి సంఘాల నాయకులతో సమావేశమయ్యారు.
ఫీజు రీయంబర్స్మెంట్పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే పోరు బాట పట్టారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ నెల 13, 14 తేదీల్లో ఫీజు దీక్ష చేపట్టనున్నారు. నిజానికి ఈ నెల 12, 13 తేదీల్లో ఈ దీక్ష జరగాల్సి ఉండింది. ఈ నెల 12వ తేదీన గ్రూప్ - 4 పరీక్షలు ఉండడంతో ఒక రోజు దీక్షను వాయిదా వేసుకున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.