టెక్కీ నీలిమది ఆత్మహత్యే: ఫోరెన్సిక్ నిపుణులు
నీలిమ తీవ్ర గాయాలతోనే చనిపోయిందని, అది హత్య కాదని, ఎవరైనా విషం ఇచ్చారనే అనే కోణంలో కూడా వైద్య పరీక్షలు చేశారమని, అటువంటిదేమీ లేదని తమ పరీక్షల్లో తేలిందని ఆయన అన్నారు. ఇన్ఫోసిస్ కార్యాలయం భవనంపై నుంచి ఎవరైనా తోసి ఉంటారా అని ప్రశ్నిస్తే అది తమ పరిధిలోది కాదని, పోలీసులు తేల్చుకోవాల్సిన అంశమని ఆయన చెప్పారు. నీలిమ కాలేయం, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బ తిన్నాయని ఫోరెన్సిక్ నిపుణుల పరీక్షల్లో తేలింది.
భవనంపై నుంచి నీలిమ ఎడమ వైపు నుంచి కింద పడిందని, పక్కటెముకలు విరిగాయని తేలిందని చెబుతున్నారు. నీలమ దేహంపై 17 చోట్ల బలమైన గాయాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణుడు చెప్పారు. బలమైన కారణాల వల్లనే నీలిమ మరణించిందని, తమ నివేదిక రాకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శల్లో నిజం లేదని అన్నారు.
బుధవారం సాయంత్రం పోస్టుమార్టం నివేదికను వైద్యులు పోలీసు అధికారులకు సమర్పించారు. పరిశీలన కోసం తామెవరం కూడా ఇన్ఫోసిస్ కార్యాలయానికి వెళ్లలేదని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తుండవచ్చు గానీ తమ పరీక్షల్లో మాత్రం ఆత్మహత్యేనని తేలిందని వారంటున్నారు. పోలీసులు విస్రా రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో అది రావచ్చునని భావిస్తున్నారు. అది వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.
నీలిమ మృతి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పూర్తి సాక్ష్యాలను సేకరించిన తర్వాతనే వివరాలను బయటకు వెల్లడించాలనే ఆలోచనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది.