ఎదుర్కోవటం ఎలా: బాలకృష్ణతో ఎర్రబెల్లి సమాలోచనలు
బాలయ్యతో ఎర్రబెల్లి భేటీలో పలు విషయాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసినందు వల్ల సీమాంధ్రలో ఎలా ఎదుర్కోవాలి, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిని, వైయస్ జగన్ ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసును ఎలా ఢీకొనాలి అనే అంశం వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై మరోసారి లేఖ ఇచ్చేందుకు టిడిపి సిద్ధపడుతున్న నేపథ్యంలో కెసిఆర్ ఎత్తుగడలను, ఆ ప్రాంతంలో పాతుకు పోయేందుకు జగన్ రచిస్తున్న వ్యూహాల విషయమై కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినం సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జెండా ఎగురవేసిన అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన విషయం తెలిసిందే. తమ పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉందని, కేంద్రానికి ఓసారి లేఖ రాసిందని, మరోసారి లేఖ రాసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. అయితే బాలయ్య వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని చెప్పవచ్చు.
కాగా బాలయ్యతో భేటీ అనంతరం ఎర్రబెల్లి దయాకర రావు ప్రముఖ స్వతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీతో భేటీ అయ్యారు. బాపూజీ తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పలుమార్లు సీమాంధ్ర, తెలంగాణ నేతలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించారు.