చిరు అప్పుడే కారు, జైలులో జగన్ విశ్రాంతి: వీరశివా
సి.రామచంద్రయ్యకు కొంత లూజ్ అని.. అందుకే చిరు ముఖ్యమంత్రి అవుతారని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. కిరణ్ పదవికి వచ్చిన ముప్పేమీ లేదన్నారు. రామచంద్రయ్య చెప్పేవన్నీ కట్టు కథలే అన్నారు. బిసిలపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మలది కపట ప్రేమ అన్నారు. నిజంగా బాబుకు, విజయమ్మకు బిసిలపై ఇంత మమకారం ఉంటే చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ సీటు, అలాగే పులివెందుల సీటు బిసిలకు కేటాయించాలన్నారు. ఎందుకంటే వీరిద్దరూ రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుంచైన నిలబడే సత్తా గలవారన్నారు.
చంద్రబాబు ఒక చంద్రగిరి స్థానంలో పోటీ చేయలేడని ఎద్దేవా చేశారు. వీరికి పార్టీ అధ్యక్ష పదవులు, ముఖ్యమంత్రి పదవులు కావాలి, బిసిలపై వీరికి అంతజాలి, కరుణ ఉంటే చంద్రబాబు, విజయమ్మలు పార్టీ అధ్యక్ష పదవులు బిసిలకు కట్టబెట్టి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం జైల్లో విశ్రాంతి తీసుకుంటున్నాడని అతను విడుదలయ్యేంత వరకు విజయమ్మ బిసిలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు.
రాయలసీమకు చెందిన ఈ ఇద్దరు పార్టీ అధ్యక్షులు బిసిల అభ్యున్నతి, అభివృద్ధి కోరుకుంటున్న వారైతే మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో బిసిలకు ఒక్క సీటు కూడా ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. బిసిల గురించి మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలన్నారు. కాలేజిలు, భూముల కబ్జాలు, తగాదా భూములు స్వాధీనం చేసుకొనే సంప్రదాయం వైకాపా నాయకులదేనని మామిళ్ళపల్లెలో ఏడున్నర ఎకరాల స్థలాన్ని దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి స్వాధీనం చేసుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు.