ఓయు ఉద్రిక్తం: రాళ్ల వర్షం, విద్యార్థికి రబ్బర్ బుల్లెట్?
విద్యార్థులు వ్యూహాత్మకంగా నెక్లస్ రోడ్డుకు చేరుకునేందుకు ప్రయత్నాలు చేశారని అంటున్నారు. ఓ వైపు ఎన్సిసి గేటు వద్ద ఓ విద్యార్థి సమూహం పోలీసులతో వాగ్వాదానికి దిగడం, పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో మరో విద్యార్థి సమూహం పోలీసుల కన్ను గప్పి నెక్లస్ రోడ్డు వైపుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
హోంమంత్రి ఇంటి ముందు ఎమ్మెల్యేల ధర్నా
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. తెలంగాణ జిల్లాల నుండి కవాతుకు తరలి వస్తున్న తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేస్తోందని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. కవాతుకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని, అరెస్టులు చేయవద్దని పోలీసులను ఆదేశించినట్లు సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు.
ప్రభుత్వం మాట తప్పినా మేం తప్పం.. కోదండరామ్
తెలంగాణ కవాతుపై ప్రభుత్వం మాట తప్పినా తాము మాట తప్పమని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. తెలంగాణవాదులుగా మేం మాట తప్పేది లేదన్నారు. అరెస్టు చేసిన తెలంగాణవాదులను వెంటనే విడుదల చేయాలని, సాయంత్రం వేదిక పై నుండే కార్యాచరణ ప్రకటిస్తామని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి తెలియజేస్తామని అన్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు హైదరాబాదు, తెలంగాణ జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద న్యూడెమోక్రసీ కార్యకర్తలను పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెక్లస్ రోడ్డులో ధూంధాం నిర్వహిస్తున్న వారిని, ప్రసాద్ ఐమాక్స్ ప్రాంతంలో ర్యాలీగా వస్తున్న తెలంగాణవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కవాతుకు అనుమతి ఉన్నప్పటికీ ర్యాలీగా వస్తే మాత్రం అనుమతించేది లేదని పోలీసులు చెబుతున్నారు.