మహిళకు బాబు గోరుముద్ద: విచిత్రవ్యక్తి.. సిఎంపై సెటైర్
దేశంలో ఎక్కడా లేని విధంగా తాము డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వం లక్షాధికారులను చేస్తామని గొప్పలు చెప్పి, అప్పుల పాల్జేసిందని డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. టిడిపి అధికారంలోకి వచ్చాక అనంతపురానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. రూ.లక్షతో పక్కా ఇళ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. వృద్ధాప్య పింఛనుగా రూ.500, వికలాంగులకు రూ.1500 ఇస్తామని పునరుద్ఘాటించారు. రైతును రుణవిముక్తం చేయడంపైనా ఆలోచిస్తున్నామన్నారు.
ఉదయాన్నే బస్సులో వ్యాయామం, యోగా తర్వాత పది గంటలకే పాదయాత్రకు సిద్ధమయ్యారు. గరిమేకలపల్లె నుంచి పేరూరు గురుకుల పాఠశాల వరకు 20 కిలోమీటర్లు నడిచారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్తోపాటు వేలాది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. రాప్తాడు నియోజకవర్గం తిమ్మాపురం ఎస్సీ కాలనీలో దళిత మహిళలతో సహపంక్తి భోజనం చేశారు. వారికి స్వయంగా వడ్డించారు.
ఓ మహిళకు ఆయన గోరుముద్దలు తినిపించడంతో కాలనీ వాసులు మురిసిపోయారు. గరిమేకలపల్లి నందమూరి నగర్లో కొలిమి పని చేసుకునే దంపతులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు కొలిమి పనిచేశారు. కుల వృత్తులవారికి ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు లేక రైతులకు పనుల్లేవని, దానివల్ల తమకూ పనుల్లేకుండాపోయాయని చెప్పారు. చంద్రబాబు స్పందిస్తూ, టిడిపి హయాంలో కులవృత్తులను గౌరవించామని, తిరిగి అధికారంలోకి వస్తే, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మంచి పనిముట్లను అందజేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, రోగాల బారిన పడుతున్నామని తిమ్మాపురంలో వెంకటేశ్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన చంద్రబాబు... ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఆ గ్రామానికి మినరల్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తానొచ్చింది మీ కష్టాలు తెలుసుకునేందుకే అన్నారు. ఇదో పవిత్రయాత్ర అన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తామన్నారు. మీరు కూడా తిరుగుబాటుకు సిద్ధం కావాలన్నారు. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపే వరకు పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగల రుణం తీర్చుకుంటానని శపథం చేశారు.