తెలంగాణ ఎప్పుడో చెప్పలేం: అజిత్, టి-ఎంపీల వెల్కం
తెలంగాణ సాధన కోసం కాంగ్రెసు ఎంపీలు కట్టుబడి ఉన్నారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పోరాడితే లక్ష్యం నెరవేరుతుందన్నారు. తనకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఢిల్లీలో తెలంగాణకు సానుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ఐక్యంగా పోరాడాలన్నారు. తెలంగాణ అంశం చాలా ఏళ్లుగా కొనసాగుతోందని, ఇటీవల జరిగిన కవాతు పైన ఢిల్లీలో కూడా చర్చ జరిగిందన్నారు.
స్వాగతించిన టి-కాంగ్ ఎంపీలు
కాగా ఆర్ఎల్డీ తెలంగాణ శాఖను ఏర్పాటు చేయనున్న అజిత్ సింగ్ నిర్ణయాన్ని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు స్వాగతించారు. తెలంగాణ పోరాటానికి, ఎంపీలకు అజిత్ చేయూతనిచ్చారని కె కేశవ రావు అన్నారు. తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీల ఎంపీలతో మాట్లాడతామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలతోనూ మాట్లాడతామన్నారు. తెలంగాణ సాధన కోసం ఎవరు పని చేసినా వారితో కలిసి పని చేస్తామన్నారు.
తెలంగాణ కోసం యూపిఏ భాగస్వామ్య పక్షాల మద్దతును కూడగడతామని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ అన్నారు. ఇదే విషయమై తాము అజిత్ సింగ్తో మాట్లాడామని చెప్పారు. అజిత్ సింగ్ యాష్కీ నివాసంలో అల్పాహార విందుకు హాజరయ్యారు. ఈ సమయంలో ఎంపీలతో మాట్లాడారు.
కెసిఆర్తో విభేదాలు లేవు.. కోదండరాం
తనకు కెసిఆర్తో విభేదాలు లేవని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. కోదండతో సహా పలువురు జెఏసి నేతలు అజిత్సింగ్ను కలిశారు. అనంతరం కోదండ మాట్లాడారు. ఢిల్లీలో తెలంగాణపై సానుకూల వాతావరణం ఉందన్నారు. అజిత్ను కలిసిన వారిలో కోదండ, ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ తదితరులు ఉన్నారు.