కాంగ్రెస్కు షాక్: జగన్ పార్టీలోకి ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు
ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెసుకు గుడ్ బై చెప్పడం అదిలాబాద్ జిల్లాలో కాంగ్రెసు పార్టీకి గట్టి ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు. జిల్లాలో ఇంద్రకరణ్కు మంచి పట్టు ఉంది. ఈయనతో పాటు ఈయన అనుచరులు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా జగన్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైన రోజే కాంగ్రెసు పార్టీకి అదిలాబాదులో ఎదురు దెబ్బ తలగడం గమనార్హం.
ప్రధానంగా తెలంగాణ అంశంపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం నుండి ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో ఇంద్రకరణ్ రెడ్డి పూర్తి అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై ఆయన పలుమార్లు తన వర్గం నేతలు, కార్యకర్తలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీలో ఉండాలా ఉండకూడదా, పార్టీ వీడితే ఏ పార్టీలో చేరితే కలిసి వస్తుందనే అంశంపై ఇంద్రకరణ్ రెడ్డి వారిని అడిగిన తర్వాతనే కాంగ్రెసుకు గుడ్ బై చెప్పారని, జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
రాజీనామా పిసిసి చీఫ్ బొత్సకు పంపించిన అనంతరం ఇంద్ర కరణ్ రెడ్డి మాట్లాడుతూ... తాను ఇక ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు.