రేపే మొబైల్ ఫోన్లు అన్నింటికి అలర్ట్ మెసేజ్... కంగారు పడొద్దు !!
దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ ఫోన్లు ఒకేసారి గట్టిగా సైరన్ మోగినట్లు శబ్దం చేయబోతున్నాయి. మే 2, 2026న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అత్యవసర హెచ్చరిక వ్యవస్థ (Emergency Alert System)ను పరీక్షించేందుకు ఈ ప్రత్యేక డ్రిల్ నిర్వహించనున్నారు. ప్రజలు ఎలాంటి భయానికి గురికావాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టంగా తెలిపారు.
ఈ భారీ స్థాయి పరీక్షను టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT), National Disaster Management Authority (NDMA) సంయుక్తంగా చేపడుతున్నాయి. ప్రకృతి విపత్తులు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగంగా సమాచారం చేరవేయడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం దీనికి 'SACHET' (National Disaster Alert Portal) అనే పేరును ఇచ్చింది. ముందస్తు హెచ్చరికల ద్వారా ప్రాణనష్టం, ఆస్తినష్టం తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని స్పష్టం చేసింది.

ఎలా పని చేస్తుంది ఈ అలర్ట్ సిస్టమ్?
ఈ వ్యవస్థ Common Alerting Protocol (CAP) ఆధారంగా రూపొందించబడింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పనిచేసే ఈ టెక్నాలజీని International Telecommunication Union (ITU) సిఫార్సు చేసింది. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే ఈ వ్యవస్థ అమలులో ఉంది.
ఇది 'సెల్ బ్రాడ్కాస్ట్' టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. అంటే, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉన్న వేలాది మొబైల్ ఫోన్లకు ఒకేసారి అలర్ట్ పంపవచ్చు. ఈ అలర్ట్ సాధారణ SMS లాగా కాకుండా-గట్టిగా సైరన్ శబ్దంతో, స్క్రీన్పై ప్రత్యేక సందేశంతో కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఫోన్ సైలెంట్లో ఉన్నా కూడా ఈ అలర్ట్ వినిపించేలా డిజైన్ చేశారు.
ఎవరికి వస్తుంది ఈ అలర్ట్?
ఈ వ్యవస్థ ప్రత్యేకత ఏమిటంటే-ఇది దేశవ్యాప్తంగా అందరికీ కాకుండా, ప్రమాదం సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలకే అలర్ట్ పంపుతుంది. ఉదాహరణకు, వరదలు, తుఫానులు, భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో ఉన్నవారికి ముందుగానే హెచ్చరికలు అందుతాయి. దీంతో ప్రజలు సమయానికి అప్రమత్తమై, రక్షణ చర్యలు తీసుకోవచ్చు.
ఇప్పటికే విజయవంతమైన పరీక్షలు..
ఇప్పటికే ఢిల్లీ-ఎన్సీఆర్ వంటి ప్రధాన నగరాల్లో ఈ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకేసారి పరీక్షించి, దాని సామర్థ్యాన్ని మరింతగా అంచనా వేయనున్నారు. ఈసారి పరీక్షలో ఎక్కువ మంది వినియోగదారులకు అలర్ట్ చేరేలా విస్తృతంగా అమలు చేస్తున్నారు.
పరీక్ష సమయంలో ఏమి చేయాలి?
NDMA అధికారుల ప్రకారం:
మీ ఫోన్లో 'Emergency Alert' నోటిఫికేషన్ వస్తుంది
గట్టిగా సైరన్ లేదా వైబ్రేషన్ వినిపించవచ్చు
(ఇది కేవలం పరీక్ష మాత్రమే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు)
ప్రజలు ఈ అలర్ట్ను చూసి భయపడకుండా, ప్రభుత్వ ప్రయత్నానికి సహకరించాలని సూచించారు.
ఎందుకు ఇది అంత ముఖ్యమైనది?
భారతదేశం వరదలు, చండమారుతాలు, భూకంపాలు వంటి సహజ విపత్తులకు గురయ్యే దేశం. ఇలాంటి సమయంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. గతంలో హెచ్చరికలు ఆలస్యంగా అందడం వల్ల భారీ నష్టం జరిగిన ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సిస్టమ్ ద్వారా ముందస్తు సమాచారం, వేగవంతమైన కమ్యూనికేషన్.. లక్ష్యిత ప్రాంతాలకు హెచ్చరికలు సాధ్యమవుతాయి.
భవిష్యత్లో ఉపయోగాలు..
భవిష్యత్తులో ఈ అలర్ట్ సిస్టమ్ను మరింత విస్తరించనున్నారు. కేవలం ప్రకృతి విపత్తులు మాత్రమే కాదు:
భద్రతా హెచ్చరికలు
అత్యవసర ప్రభుత్వ ప్రకటనలు
పబ్లిక్ సేఫ్టీ అలర్ట్స్ కూడా పంపేలా అభివృద్ధి చేయనున్నారు.












Click it and Unblock the Notifications