పిఎం కాదు, ముకేష్ నడుపుతున్నారు: కేజ్రీవాల్
దేశాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ నడపించడం లేదని, ముకేష్ అంబానీ నడుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపి, కాంగ్రెసు రెండు పార్టీలు కూడా ముకేష్ అంబానీ మాటలే వింటున్నాయని ఆయన అన్నారు. తాను గులాం నబీ ఆజాద్ను మేనేజ్ చేయగలలని రంజన్ భట్టాచార్య చెప్పారని ఆయన అన్నారు. గతంలో మణిశంకర్ అయ్యర్ కూడా పదవిని కోల్పోయారని గుర్తు చేశారు.
పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల మధ్య కుమ్మక్కు వల్లనే దేశంలో ధరలు పెరుగుతన్నాయని ఇండియా అగనెస్ట్ కరప్షన్ కార్యకర్త కేజ్రీవాల్ అన్నారు. కేంద్ర మంత్రి వర్గ కూర్పుపై రాడియా, భట్టాచార్య మధ్య జరిగిన సంభాషణలు టేపుల్లో ఉన్నాయి. ఇది వరకు బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాలపై తీవ్ర ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ తాజాగా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీపై పడ్డారు.
గ్యాస్ ధరను ప్రభుత్వం నిర్ణయించలేదని, ముకేష్ అంబానీ నిర్ణయించారని, గ్యాస్ క్యూబిక్ మీటరు ధరను 2.5 నుంచి 4.25 డాలర్లకు పెంచాలని ముకేష్ అంబానీ సూచించారని అన్నారు. కెజి బేసిన్ రిలయన్స్కు దక్కడం వెనక రాజకీయ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. కొంత మంది మంత్రుల జేబులు నింపుతున్నందు వల్లనే రిలయన్స్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రిలయన్స్ దేశాన్ని దోచుకుంటోందని వ్యాఖ్యానించారు. గ్యాస్ ధరల విషయంలో ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా నిర్ణయించిందని అన్నారు. కేజ్రీవాల్తో పాటు ప్రశాంత్ భూషన్ కూడా మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు.