దూరంగా..దగ్గరగా..: టిడిపి గ్రేటర్ అధ్యక్షుడిగా తలసాని
కాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ అధ్యక్షుడికి దూరం జరిగి ఆ తర్వాత క్రమంగా దగ్గరయ్యారని చెప్పవచ్చు. రాజ్యసభ స్థానాన్ని తలసాని ఆశించారు. కానీ ఆయనకు దక్కలేదు. పైగా పార్టీలో తన వ్యతిరేక వర్గం అయిన దేవేందర్ గౌడ్కు దక్కడంతో తలసాని అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దేవేందర్ గౌడ్కు రాజ్యసభ స్థానం ఖాయం చేసిన పార్టీ సమావేశంలోనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమావేశం నుండి ఉన్నపళంగా బయటకు వచ్చారు. పార్టీలో నుండి వెళ్లిపోయి మళ్లీ వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. పలు సందర్భాలలో టిడిపిలో ఉన్నారా అని ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పలేదు. పార్టీలో లేనని ఎప్పుడూ చెప్పక పోయినప్పటికీ దూరమయ్యేందుకు దాదాపు సిద్ధమయ్యారు. కడప ఎంపి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగింది.
అయితే ఆ తర్వాత తలసాని అసంతృప్తి తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల పలుమార్లు ఆయన చంద్రబాబును కలుసుకున్నారు. గ్రేటర్ అధ్యక్ష పదవి ఇస్తామని హామీ ఇచ్చినందు వల్లే తలసాని వెనక్కి తగ్గారని అంటున్నారు. హామీ ఇచ్చినట్లుగా చంద్రబాబు నాయుడు ఆయనకు గ్రేటర్ పీఠం కట్టబెట్టారని అంటున్నారు.