విభజించి పాలించు: చంద్రబాబుతో వైయస్ జగన్ గేమ్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలతో మైండ్ గేమ్ ఆడుతూనే మరోవైపు విభజించి పాలించు సూత్రాన్ని అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెసు నుండి వేరు కుంపటి పెట్టుకున్న తర్వాత జగన్ పార్టీ అప్పుడప్పుడు దూకుడుగా మరికొన్ని సందర్భాల్లో స్తబ్దుగా ఉంటూ వస్తోంది. అవసరం అనుకున్న సమయాల్లో జగన్ ఒరలో నుండి కత్తిని తీసినట్లుగా.. ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను తన వైపుకు రప్పించుకుంటున్నారని అంటున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమ పార్టీలోకి వచ్చే వారి పేర్లు మాత్రమే కాకుండా ఉద్దేశ్య పూర్వకంగా ఆయా పార్టీలలో జిల్లాలో, రాష్ట్రంలో బలంగా ఉన్న నేతలు కూడా తమ పార్టీలోకి వస్తున్నట్లుగా గోబెల్స్ ప్రచారం చేస్తోందని టిడిపి నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఇది జగన్ మైండ్ గేమ్గా పయ్యావుల చెప్పారు. కేవలం పయ్యావుల మాత్రమే కాదు. తెరాస ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్, కాంగ్రెసు ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కూడా జగన్ పార్టీ వైపు వస్తారనే వార్తలు ఆ పార్టీ వ్యూహంలోనే భాగమే అని అంటున్నారు. గతంలోనూ ఇలాంటివి కోకొల్లలు అని చెబుతున్నారు. ఇలాంటి ప్రచారం ద్వారా ప్రత్యర్థి పార్టీలు దెబ్బతిన్నాయని, ప్రజలు తమ వైపే మొగ్గు చూపుతున్నారనే భ్రమ కల్పించాలని ఆ పార్టీ భావిస్తోందని అంటున్నారు.

కృష్ణా జిల్లా టిడిపి ముఖ్య నేత వల్లభనేని వంశీ మోహన్ కూడా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని దారిలోనే జగన్ వైపు వెళ్తారనే ప్రచారం జరిగింది. అది నిజమా అన్నట్లు వంశీని జగన్ బహిరంగంగా ఆలింగనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత వంశీ వివరణ ఇచ్చి వెళ్లనని చెప్పినప్పటికీ ప్రచారం మాత్రం ఆగలేదు. ఇది ఆ పార్టీ వ్యూహాత్మకంగా చేసిందనే వాదనలు ఉన్నాయి.

కృష్ణా జిల్లాకే చెందిన టిడిపి నేత ఉమా మహేశ్వర రావు సోదరుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. దేవినేనికి అంతా ఆయన సోదరుడే. టిడిపిలో ఉన్నప్పుడు అన్నీ ఆయనే చూసేవారు. కానీ తన సోదరుడిని ఆ పార్టీలోకి లాక్కొని జగన్ పార్టీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని దేవినేని అప్పుడు విమర్శించారు.

శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాద రావు ఫ్యామిలీని కూడా జగన్ పార్టీ రాజకీయంగా రెండు చేసింది. ధర్మాన కృష్ణదాసు మంత్రి అయిన తన సోదరుడికి కాంగ్రెసులో ఉండగా అండగా ఉండేవాడు. కానీ ఆయన ఆ తర్వాత జగన్ వైపుకు వెళ్లాడు. దీంతో అక్కడ గత ఉప ఎన్నికల్లో ధర్మాన మరో సోదరుడు ధర్మాన కృష్ణదాసుపై పోటీకి దిగారు. అనుబంధాలపరంగా ఎలాంటి విభేదాలు లేకున్నా రాజకీయంగా మాత్రం ఆ పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పుట్టిన తర్వాత రెండుగా చీలింది.

ఖమ్మం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయులలో ఒకరైన జలగం వెంకట్రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరగా మరో తనయుడు జలగం ప్రసాద రావు కాంగ్రెసులోనే కొనసాగుతున్నారు. వెంకట్రావు నిన్ననే వైయస్ విజయమ్మ సమక్షంలో వైయస్సార్ పార్టీలో చేరారు.
ముందే వారితో చర్చలు జరిపి పార్టీకి లబ్ధి చేకూరుతుందనుకున్న సమయంలో వారిని పార్టీలోకి తీసుకుంటున్నారని అంటున్నారు. అప్పటి వరకు అలాంటి నేతలు పార్టీలో ఉంటూనే సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తూ ఆ పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదంతా జగన్ పక్కా వ్యూహంతో 2014 ఎన్నికల వరకు లేదా ముందస్తు ఎన్నికలు వచ్చే వరకు కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇటీవల టిడిపి ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కొడాలి నాని, కాంగ్రెసు ప్రజాప్రతినిధులు కోమటిరెడ్డి సోదరులు, ఆళ్ల నాని, సుజయ కృష్ణ రంగారావు... ఇలా ఎవరిని తీసుకున్నా సొంత పార్టీ పైన విమర్శలు చేస్తూ కొనసాగుతూనే అవసరమైన సమయంలో జగన్ పార్టీలోకి వెళ్లే వ్యూహంతో ఆ నేతలు ఉన్నారని అంటున్నారు. ఇదంతా జగన్ మైండ్ గేమ్గా చెబుతున్నారు. అంతేకాదు.. విభజించి పాలించు అనే సూత్రాన్ని కూడా అమలుపరుస్తాన్నారని అంటున్నారు.
మంత్రి ధర్మాన, మైలవరం ఎమ్మెల్యే దేవినేని, జలగం ఫ్యామిలీలే ఇందుకు ఉదాహరణ అని చెబుతున్నారు. అయితే మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం తమకు ఏమాత్రం లేదని, తమ పార్టీలోకి వస్తామని చర్చలు జరుపుతున్న వారి పేర్లనే తాము చెబుతున్నామని, రాజకీయాల్లో ఒకే కుటుంబంలోని వారు వేరు వేరు రాజకీయ పార్టీల్లో ఉండటం కోకొల్లలు చూస్తున్నామనేది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాదన.












Click it and Unblock the Notifications