జగన్ కోసం మమ్మల్ని ఇరికిస్తున్నారు: మంత్రులు
జగన్ అక్రమాస్తుల కేసులో తమ పాత్రపై విచారణ జరపాలంటూ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. వైయస్ జగన్కు సహకరించాలన్న రహస్య ఎజెండాతోనే పిటిషనర్ ఈ పిటిషన్ను దాఖలు చేశారని వారు ఆరోపించారు. జగన్ను సిబిఐ విచారిస్తున్న తీరుపట్ల పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారే తప్ప తమపై చేసిన ఆరోపణలను రుజువు చేసేలా ఒక్క ఆధారం కూడా చూపలేదని వారన్నారు.
చట్టాలను దుర్వినియోగం చేస్తూ, న్యాయ ప్రక్రియను తప్పుదోవ పట్టించాలని చూస్తున్న పిటిషనర్ ఉద్దేశాలను గమనించి ఆయన దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించాలని, ఆయనకు భారీగా జరిమానా విధించాలని వారు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మంత్రులు గీతారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ, మోపిదేవి వెంకటరమణ (ప్రస్తుతం మాజీ మంత్రి), ఐఏఎస్ అధికారులు ఎం.శామ్యూల్, మన్మోహన్సింగ్, శ్యాంబాబు, ఆదిత్యనాథ్ దాస్, సీవీఎస్కే ప్రసాద్, ఎస్వీ ప్రసాద్ (ప్రస్తుతం రిటైర్డ్) కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశారు. ఐఏఎస్ రత్నప్రభ గతంలోనే కౌంటర్ దాఖలు చేశారు. మరో ఐఏఎస్ శ్రీలక్ష్మికి కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు వారాల గడువు లభించింది.
జగన్ కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన ఐదు నెలల తర్వాత పిటిషనర్ కోర్టుకు ఫిర్యాదు చేయడం గమనించాల్సి ఉందని వారన్నారు. తమ పేరిట జారీ అయిన జీవోలన్నీ నిబంధనల ప్రకారమే ఉన్నాయని, సిబిఐ నమోదు చేసిన కేసులో ముద్దాయిలైన జగన్, ఇతరులు వారి హోదాలను దుర్వినియోగం చేసి, జీవోల ద్వారా లబ్ధి పొందిన వారితో నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తమకు తెలియదని వారు తమ కౌంటర్లో అన్నారు.