తెలంగాణ రాదు: లగడపాటి ధీమా, ఇటు జోష్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం వెలువడదనే ధీమాతో కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ధీమాతో ఉన్నారు. ఇదే ధీమాను ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల వద్ద వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయం కుదిరే వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదని, ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు లేవని ఆయన అన్నారు. ఈ నెల 28వ తేదీన జరిగే అఖిలపక్ష సమావేశం కూడా గత అఖిల పక్ష సమావేశాల మాదిరిగానే ఏమీ తేల్చకుండా జరిగిపోతుందని ఆయన అభిప్రాయంగా కనిపిస్తోంది.
గతంలో అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పార్టీకి ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానించింది. దీంతో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఓ వైపు సమైక్యవాదాన్ని, మరో వైపు తెలంగాణవాదాన్ని వినిపించాయి. తమ పార్టీ వైఖరులను మాత్రం తేల్చలేకపోయాయి. అయితే, ఇప్పుడు కూడా అలాగే పిలిస్తే ఇప్పటి వరకు తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించని తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తప్పించుకునే అవకాశాలుంటాయి. ఒక్క ప్రతినిధిని మాత్రమే పిలిచి, పార్టీ వైఖరి చెప్పాలంటే మాత్రం చాలా వరకు తెలంగాణపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అలా కాకపోతే, లగడపాటి అన్నట్లు మరోసారి గతం పునరావృతం అవుతుంది. అయితే, ఈసారి ఒక్కో పార్టీ నుంచి ఒక్కే ప్రతినిధిని ఆహ్వానిస్తారనే మాట వినిపిస్తోంది. ఇందుకు కాంగ్రెసు పార్టీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి కూడా ప్రకటించాల్సి ఉంటుంది. కాంగ్రెసు తన వైఖరిని స్పష్టం చేసినప్పుడు ఇతర పార్టీలు చెప్పే అవకాశాలు లేవు.
అయితే, సిపిఎం తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది, మజ్లీస్ మాత్రం రాయల తెలంగాణకు మాత్రమే అంగీకరిస్తామని చెబుతోంది. ఈ రెండు పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఏకాభిప్రాయం కుదరలేదని కేంద్రం దాటవేస్తుందని కూడా లగడపాటి భావిస్తూ ఉండవచ్చు. కాగా, ఎన్నికలకు ఆరు నెలల ముందు తమ కాంగ్రెసు పార్టీ తెలంగాణ అంశాన్ని మ్యానిఫెస్టోలో చేరుస్తుందని, అంత వరకు ఏమీ తేల్చదని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ పదే పదే చెబుతున్నారు. టిజి వెంకటేష్ మాటలు మాత్రమే కాస్తా విశ్వసనీయంగా కనిపిస్తోంది. అయితే, అప్పుడైనా కాంగ్రెసు స్పష్టమైన వైఖరి చెబుతుందా అనేది అనుమానమే.