ఢిల్లీ గ్యాంగ్ రేప్: శాంతిగా ఉండాలని విక్టిం తండ్రి విజ్ఞప్తి
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి గ్యాంగ్ రేప్ బాధితురాలి తండ్రి శాంతియుతంగా నిరసన తెలపాలని సూచించారు. విధ్వంసాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు. నిందితులకు సాధ్యమైనంత త్వరగా శిక్ష పడేందుకు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. అలాగే తన 23 ఏళ్ల కూతురు కోసం దేవుడిని ప్రార్థించాలని ఆయన ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. తన కూతురు ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని చెప్పారు.
కాగా వారం రోజుల క్రితం జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన వేడి దేశ రాజధానిలో ఇంకా చల్లారలేదు. పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఆదివారం ఇండియా గేట్ వద్దకు తరలి వచ్చారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనకారులు రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది.
ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు వాటర్ క్యానన్లు, బాష్పవాయువును ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఆందోళనకారులపై లాఠీఛార్జ్ని నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద మరికొంతమంది ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని కూడా అక్కడి నుండి చెదరగొట్టారు. ఢిల్లీలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఆందోళనకారులకు బాబా రామ్ దేవ్ మద్దతు పలికారు.