4వసారి సిఎంగా నరేంద్రమోడీ: బాలయ్య, నితీష్ డుమ్మా
అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర దామోదర మోడీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర గవర్నర్ కమలా బేనీవాల్ ముఖ్యమంత్రిగా మోడీచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ పార్టీల అగ్రనేతలు తరలి వచ్చారు. మోడీ తన ప్రమాణ స్వీకార ఉత్సవానికి యూపియేతర, వామపక్షేతర నేతలను దాదాపు చాలామందిని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, శివసేన అధినేత ఉద్దవ్ థాకరే, ఓంప్రకాశ్ చౌతాలా, బిజెపి నేతలు లాల్ కృష్ణ అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ తదితరులు తరలి వచ్చారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దూరంగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోని జెడి(యు) కూడా దూరంగా ఉంది.
మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా హీరో, టిడిపి నేత నందమూరి బాలకృష్ణకు ఆహ్వానాలు అందాయి. అయితే బిజెపితో సఖ్యంగా ఉంటే రాష్ట్రంలో పార్టీకి ఇబ్బందులేనని భావించిన చంద్రబాబు తన బావమరిది బాలయ్య మోడీ సమావేశానికి వెళ్లవద్దని సూచించారు.