రాజీనామా-బెదిరించొద్దు: విభజనపై సీమాంధ్రXసీమాంధ్ర
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆంధ్ర ప్రదేశ్కు లాభం చేకూర్చేలా ఉంటుందని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు వీరశివా రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి, మల్దాది విష్ణు తదితరులు తెలంగాణపై ఎలాంటి సంకేతాలు లేవని చెబుతున్నారు.
సమైక్యాంధ్ర భేటీకి 10 మంది మంత్రులు, 27 మంది ఎమ్మెల్యేలు
హైదరాబాదులోని మంత్రుల భవన సముదాయంలో జరుగుతున్న సమైక్యాంధ్ర భేటీకి పది మంది మంత్రులు, ఇరవై ఏడు మంది శాసనసభ్యులు, ఇద్దరు పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. మంత్రులు కొండ్రు మురళీ మోహన్, పార్థసారథి, కన్నా లక్ష్మీ నారాయణ, శైలజానాథ్, గంటా శ్రీనివాస్ రావు, వట్టి వసంత్ కుమార్, తోట నరసింహులు, మహీధర్ రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి, ఎంపీలు రాయపాటి సాంబశివ రావు, అనంత వెంకట్రామి రెడ్డిలు హాజరయ్యారు.
ఢిల్లీకి డిజిపి, సిఎస్
డిజిపి దినేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ గురువారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. విభజన రాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో వారి పర్యటన చర్చనీయాంశమైంది. అయితే విభజన రాజకీయాలకు వారి ఢిల్లీ పర్యటనకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా రివ్యూ సమావేశం కోసం మిన్నీ మాథ్యూ, కోస్టల్ సెక్యూరిటీకి సంబంధించి హోంశాఖ సమావేశంలో పాల్గొనేందుకు దినేష్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారు.