Viral Video: "వీడియో కాల్ లోనే తండ్రి అంత్యక్రియల్లో కూతుర్ల నివాళి"-ఎటుపోతున్నారన్న సజ్జనార్..!
హర్యానాలోని సోనిపట్ లో మానవత్వానికే మచ్చగా నిలిచే ఓ దుర్మార్గ ఘటన చోటు చేసుకుంది. వ్యాపారవేత్త అయిన తండ్రి తన జీవిత చరమాంకంలో వృద్ధాశ్రమంలో చనిపోతే కనీసం కుమార్తెలు అంత్యక్రియలకు (Farewell) కూడా రాకుండా కేవలం వీడియో కాల్ లోనే వాటిని చూసిన ఘటన దేశవ్యాప్తంగా పలువురిని కంటతడి పెట్టిస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ (VC sajjanar) దీన్ని షేర్ చేశారు. అంతే కాదు ఈ అవమానవీయ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
హరియాణాలోని సోనిపట్కు చెందిన ఒకప్పటి ప్రముఖ వ్యాపారవేత్త జీవిత చరమాంకంలో ఒంటరితనంతో కుమిలిపోతూ వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారని, ఆస్తులు, అంతస్తులు సంపాదించినా, పిల్లలను ఉన్నత స్థితిలో నిలబెట్టినా.. ఆయన చివరి ప్రయాణంలో మిగిలింది మాత్రం అనాథ శవంగా మారిన వేదనే అంటూ సజ్జనార్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. బతికి ఉన్నప్పుడు కంటపడని కన్నప్రేమ.. కన్నుమూశాక వీడియో కాల్ దర్శనం! ఎటు పోతోంది ఈ సమాజం?! అని ఆయన ప్రశ్నించారు. రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి? నేటి సమాజంలో యంత్రాల్లా మారుతున్న మానవ సంబంధాలు, మంటగలిసిపోతున్న నైతిక విలువలకు ఈ దృశ్యమే ప్రత్యక్ష నిదర్శనం అన్నారు.

బతికి ఉన్నప్పుడు కంటపడని కన్నప్రేమ.. కన్నుమూశాక వీడియో కాల్ దర్శనం! ఎటు పోతోంది ఈ సమాజం?!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) August 5, 2026
రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి? నేటి సమాజంలో యంత్రాల్లా మారుతున్న మానవ సంబంధాలు, మంటగలిసిపోతున్న నైతిక విలువలకు ఈ దృశ్యమే… pic.twitter.com/CCMMyqFMhl
కుమార్తెలు కన్నతండ్రి కన్నుమూసినా కడసారి చూపుకైనా రాలేకపోయారని, ఆఖరికి అంత్యక్రియలను కూడా మొబైల్ ఫోన్లో వీడియో కాల్ ద్వారా వీక్షిస్తూ సరిపెట్టుకున్నారని సజ్జనార్ తెలిపారు. తండ్రి చివరి కార్యాల ఖర్చుల కోసం కేవలం రూ.5,100 పంపి తమ బాధ్యత తీరిపోయిందనుకున్నారని వెల్లడించారు. మిమ్మల్ని ఈ లోకంలోకి తెచ్చి, మీ భవిష్యత్తు కోసం తమ జీవితాలనే ధారపోసిన కన్నతండ్రి ఆఖరి ప్రయాణంలో తోడుగా నిలబడలేని ఈ విలాసవంతమైన, వ్యాపారాత్మక బతుకులు ఎందుకు? కోట్లు సంపాదించినా, ఉన్నత హోదాల్లో స్థిరపడినా కన్నవారి రుణం తీర్చుకోలేని చదువులు, సంస్కారం ఏ పాటివి?
అని ప్రశ్నించారు.
చివరి క్షణాల్లో సాంకేతికత అందించే డిజిటల్ స్క్రీన్లు, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లు కన్నపేగు అనుబంధానికి ప్రత్యామ్నాయం కాగలవా? అని సజ్జనార్ ప్రశ్నించారు. తల్లిదండ్రులు బతికున్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ఆదరించడం, వారి ఆఖరి ఘడియల్లో తోడుగా నిలవడం పిల్లలుగా ప్రాథమిక ధర్మం అన్నారు. కన్నవారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయడం, వారి మరణాన్ని కూడా వీడియో కాల్స్ ద్వారా చూస్తూ మమకారాలను తెంచేసుకోవడం అత్యంత శోచనీయం అని సజ్జనార్ తెలిపారు. మానవత్వానికే మచ్చ తెచ్చే ఇలాంటి సంస్కృతి మారాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications