షర్మిల సభ రద్దు: భోజనం తర్వాత ఆరు కిలో మీటర్లు
వర్షం కారణంగా ఆమె చేపట్టిన పాదయాత్ర ఈ రోజు కుదించబడింది. ఆమె నేడు కేవలం ఆరు మీటర్లు మాత్రమే నడువనున్నారు. మరోవైపు వర్షం కారణంగా జిల్లాలోని మిర్యాలగూడలోని సభను కూడా రద్దు చేశారు. షర్మిల పాదయాత్ర భోజన విరామం అనంతరం ప్రారంభం కానుంది.
రూట్ మ్యాప్ ప్రకారం షర్మిల పాదయాత్ర ఈ రోజు మిర్యాలగూడ మండలంలోని తుంగపాడు, శ్రీనివాసనగర్, వెంకటాద్రిపాలెం, దుర్గానగర్ల మీదుగా మిర్యాలగూడకు చేరుకుంటుంది. అక్కడి రాజీవ్ చౌరస్తా వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. మిర్యాలగూడలోని ఓ నేత ఇంట్లో షర్మిల బస చేస్తారు. అయితే, వర్షం కారణంగా సభ రద్దయింది.
కాగా, మరో ప్రజా ప్రస్థానం పేరిట నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిలకు శుక్రవారం తెలంగాణ సెగ తగిలిన విషయం తెలిసిందే. ఆమె పాదయాత్ర జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ముకుందాపుర్లో ఉన్న సమయంలో తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. షర్మిల ప్రసంగిస్తుండగా పలువురు తెలంగాణవాదులు జై తెలంగాణ అంటూ నినాదాలు చేసి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. తెలంగాణపై జగన్ పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాసేపటికి పరిస్థితి సద్దుమణిగింది.