చిరు నిలువలేదు, జగన్ పార్టీ కాంగ్రెసులోకే..: బాబు

ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా కాంగ్రెసు పార్టీలో విలీనమయ్యేదేనని చంద్రబాబు అన్నారు. కేవలం తమ తెలుగుదేశం పార్టీ మాత్రమే సొంతకాళ్లపై నిలబడి కాంగ్రెసుకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం సాగిస్తోందని ఆయన అన్నారు. పార్టీ గుర్తులపైనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన కోరారు.
2001 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలనే సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. పంచాయతీ వార్డు సభ్యుని నుంచి నగరపాలక సంస్థ మేయర్ వరకు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లతో పాటు సుప్రీంకోర్టు సూచనల మేరకు బీసి రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు నాయకులు సహకార ఎన్నికల మాదిరిగానే పార్టీ గుర్తులతో కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.
కాంగ్రెసు పార్టీ ఆయారాం గయారాంలను డబ్బులతో కొనుగోలు చేసి గెలుపొందాలనే ఆలోచనతో వ్యవహరిస్తోందని, సహకార ఎన్నికల్లో చాలా చోట్ల ఇలాగే జరిగిందని, ఈ పరిస్థితి తనకు చాలా బాధ కలిగించిందని అన్నారు. చెయ్యి గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తే ఈ మొండిచేయి చూసిన ఓటర్లు పచ్చడి పచ్చడిగా చేయిని విరగ్గొడుతారని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ గుర్తుతో ఎన్నికలు నిర్వహిస్తే విలువలకు తిలోదకాలు ఇచ్చి డబ్బులకు అమ్ముడుపోయిన వారి ఉద్యోగం పోతుందనే భయం ఉంటుందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications