బాంబు పేలుళ్లు: సిసిటివీ కెమెరాలో అనుమానితుడు
పేలుళ్లకు పాల్పడినవారు ఎక్కడి నుంచి వచ్చారనే విషయం కనిపెట్టి, వారిని గుర్తించడానికి ఆ ఫుటేజీ పనికి వస్తుందని అనుకుంటున్నారు. మొబైల్ సర్వీసింగ్ సెంటర్కు చెందిన సిసిటీవి కెమెరా ఫుటేజీ హార్డ్ డిస్క్ను దర్యాప్తు అధికారులు విశ్లేషిస్తున్నారు. అక్టోపస్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ సాంకేతిక నిపుణుడు దాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ముసారాంబాగ్ వైపు నుంచి చందన బ్రదర్స్ మీదుగా దుండగులు వచ్చి ఉంటే మొబైల్ సర్వీసింగ్ సెంటర్ సిసిటీవీ కెమెరాలో రికార్డు అయి ఉంటుందని భావిస్తున్నారు. కోణార్క్ థియేటర్ వైపు నుంచి వచ్చి ఉంటే, ఇతర సంస్థల సిసిటివీ కెమెరాల్లో రికార్డయి ఉంటాయని అనుకుంటున్నారు. దీంతో సిసిటివీ కెమెరాల ఫుటేజీలపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు.
పేలుళ్లకు కొద్ది నిమిషాల ముందు కెరియర్పై సంచీ పెట్టుకుని 30 ఏళ్ల పడిలో ఉన్న ఓ వ్యక్తి సైకిల్పై వస్తున్న వ్యక్తిని సిసిటివీ కెమెరా ఫుటేజీలో గుర్తించినట్లు చెబుతున్నారు. సాయంత్రం గం.6.38 నిమిషాలకు ఆ వ్యక్తి వచ్చినట్లు ఆ తర్వాత అతను వెళ్లిపోయిన విషయాన్ని గుర్తించారని మీడియాలో వార్తలు వచ్చాయి.
దిల్షుక్నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిఘా కెమెరా అనుమానితుడిని పట్టిచ్చినట్లు కూడా చెబుతున్నారు. కానీ, అతని ముఖం సరిగా కనిపించడం లేదని సమాచారం. దీంతో అతన్ని గుర్తించడానికి పోలీసులు నిపుణుల సాయం తీసుకుంటున్నారు.